ఆర్థిక నేరస్థుడికి సాయం చేశారా, లేదా: సుష్మకు ఖర్గే, వెల్లోకి సోనియా, రగడ
న్యూఢిల్లీ: ఆర్థిక నేరస్థుడైన లలిత్ మోడీకి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సాయం చేశారా? లేదా? చెప్పాలని కాంగ్రెస్ పార్టీ లోకసభ పక్షనేత మల్లికార్జున ఖర్గే బుధవారం లోకసభలో ప్రశ్నించారు. లలిత్ గేట్ పైన చర్చించేందుకు స్పీకర్ అంగీకరించారు.
ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ఆర్థిక నేరస్థుడికి సుష్మ సాయం చేశారా లేదా చెప్పాలన్నారు. లలిత్ గేట్ ఆరోపణల పైన సమాధానం చెప్పాల్సింది సుష్మ కాదని.. ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇంతకాలం ప్రతిష్టంభనకు ప్రభుత్వమే కారణమన్నారు.
ఇంత రగడ జరిగి ఉండేది కాదు
ముందే చర్చకు అనుమతించి ఉంటే ఇంత రగడ జరిగి ఉండేది కాదన్నారు. చట్టం వేరు, మానవత్వం వేరన్నారు. మానవత్వంతో సాయమంటే చట్టాన్ని ఉల్లంఘించాలా అని ప్రశ్నించారు. లలిత్ మోడీకి సుష్మ కుటుంబ సభ్యులనే న్యాయవాదులు అన్నారు.
లలిత్ - సుష్మ కుటుంబాల మధ్య ఆర్థిక సంబంధాలు
లలిత్ మోడీని భారత దేశానికి రప్పించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎవరికైనా సాయం చేయాలంటే చట్టానికి లోబడి చేయాలన్నారు. ఇరవై ఏళ్లుగా సుష్మ, లలిత్ మోడీ కుటుంబాల మధ్య ఆర్థిక సంబంధాలున్నాయన్నారు.
మనీ లాండరింగ్ కేసులో ఐటీ శాఖ ఎదుట లలిత్ మోడీ విచారణకు హాజరు కాలేదన్నారు. లలిత్ మోడీ ఓ ఆర్థిక నేరస్థుడు అన్నారు. ఆయనకు వ్యతిరేకంగా గత ఆర్థిక మంత్రి ఇంగ్లాండుకు లేఖ రాశారన్నారు. అలాంటి వ్యక్తికి విదేశాంగ శాఖ మంత్రి ఎలా సాయం చేసేందుకు ముందుకు వచ్చారన్నారు.
ప్రధాని వినటం లేదు
లలిత్ మోడీ పైన చర్యలకు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చర్యలకు ఎందుకు ఉపక్రమించడం లేదన్నారు. ప్రధాని మోడీని సభకు పిలవాలన్నారు. ప్రధాని రేడియో, టీవీల్లో మాట్లాడుతారని కాని సభలో మాట్లాడరన్నారు. మా వాదనను ప్రధాని వినకుంటే చర్చకు ప్రయోజనం లేదన్నారు.
తాము రూల్ 56 కింద చర్చ చేపట్టామని కోరితే, రూల్ 193 ప్రకారం చేపట్టారన్నారు. చర్చించి సమస్య ముగిసిందని చెప్పేందుకే రూల్ 193 ప్రకారం చర్చను చేపట్టారన్నారు. సుష్మా స్వరాజ్ చట్టాన్ని ఉల్లంఘించారని కేంద్రం ఎందుకు చెప్పడం లేదన్నారు.
లేఖలు, ఈ మెయిల్స్ కాకుండా నోటిమాటతో లలిత్ మోడీకి సహకరించారన్నారు. ఈ వ్యవహారాన్ని మనం లోతుగా ఆలోచించాలన్నారు. మానవతా దృక్పథంతో సాయం చేసే ముందు భారత్ రావాలనే షరతు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
సుష్మ భావోద్వేగాలు ప్రదర్శిస్తున్నారు.. రాజీనామా చేయాలి
చట్టం వేరు, మానవత్వం వేరు అని... ఆర్థిక నేరస్థుడికి సాయం చేయాలన్నా చట్టానికి లోబడి చేయాలన్నారు. ఏ తప్పు చేయలేదని సుష్మా స్వరాజ్ భావోద్వేగాలు ప్రదర్శిస్తున్నారన్నారు. లలిత్ మోడీ విదేశాల్లో, రిసార్టుల్లో తిరిగేందుకు మీరు సాయం చేస్తారా అని నిలదీశారు.
నల్ల ధనం వెనక్కి తెస్తామని ఆర్థిక నేరస్తుడికి ఎందుకు సహకరిస్తున్నారన్నారు. ప్రయాణ పత్రం ఇవ్వడంలో ఇబ్బంది లేదని చెప్పానని ఎలా ట్వీట్ చేశారని సుష్మను ప్రశ్నించారు. మానవతా దృక్పథంతో సాయం అని సుష్మ చెప్పడం సరికాదని, ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మోడీ ప్రయాణ పత్రాలు ఇస్తే భారత్ - బ్రిటన్ మధ్య సంబంధాలకు సమస్య ఉండదని బ్రిటన్కు చెప్పారన్నారు. లలిత్ మోడీకి సాయం చేసేందుకు మూడు విభిన్న కారణాలు చెప్పారన్నారు. ఒక కారణానికి మరో కారణానికి సంబంధం లేదన్నారు. మొదటి పెళ్లి తర్వాత అధ్యక్షుడిని కలిసేందుకని ఓ కారణం... ఆ తర్వాత వైద్యానికి అని కారణం చెప్పారన్నారు.
భారత్లో ఉన్న తన భార్యకు ప్రమాదమని లలిత్ మోడీ చెపితే ఆ మాత్రం రక్షణ ఇచ్చేందుకు ఎన్డీయే సిద్ధంగా లేదా అన్నారు. లలిత్ మోడీకి సహకరించేందుకు అధికారుల సలహా ఎందుకు తీసుకోలేదన్నారు. లలిత్ గేట్ విషయంలో వసుంధర రాజే అంశంపై తేల్చాలన్నారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ వినడం లేదు, చూడటం లేదన్నారు.
వసుంధరపై ఖర్గే ఘాటు వ్యాఖ్యలు
వసుంధర - లలిత్ మోడీల మధ్య అన్నీ నేరపూరిత సంబంధాలేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, సభలో లేని వసుంధర రాజే పేరును తీసుకు రావడంపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక ముఖ్యమంత్రిపై ఆధారాల్లేకుండా మాట్లాడరాదన్నారు. సభలో లేనివారి పేరు వద్దని స్పీకర్ సూచించారు. ఈ సందర్భంగా లోకసభలో గందరగోళం ఏర్పడింది. సభను వాయిదా వేశారు.
వెల్లోకి సోనియా
వాయిదాకు ముందు లోకసభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సోనియా గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెల్లోకి వచ్చారు. దీంతో గందరగోళం ఏర్పడింది. సభాపతి సభను రెండున్నర గంటల వరకు వాయిదా వేశారు.