కశ్మీర్ కావాలి...కానీ కశ్మీరీలు కాదు: చిదంబరం ట్వీట్ వెనక రహస్యం ఏమిటి..?
ఢిల్లీ: ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కొన్ని వ్యాఖ్యలు చేశారు.. కశ్మీర్ భారత భూభాగంలో ఉండాలని కొందరు ప్రజలు కోరుకుంటున్నారని అయితే కశ్మీరీలు మాత్రం భారతీయులుగా ఉండరాదని మరికొందరు కోరుకుంటున్నారని చిద్దూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేఘాలయా గవర్నర్ తథాగత రాయ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి చిదంబరం ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపుతప్పుతోందని చెప్పిన చిదంబరం... మేఘాలయ గవర్నర్ తథగత రాయ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. కశ్మీరీ ఉత్పత్తులను నిషేధించాలని, అక్కడికి పర్యాటకులు కూడా వెళ్లరాదని తథాగత రాయ్ కామెంట్ చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు చిదంబరం.
The irony of the situation is depressing. We want Kashmir to be part of India, but we do not want Kashmiris to be part of Indians.
— P. Chidambaram (@PChidambaram_IN) February 21, 2019
కశ్మీరీలకు భారత దేశంలో స్థానం లేదని చేసిన వారి వ్యాఖ్యలను స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహం గమనిస్తోందని చిదంబరం చెప్పారు. ఇదిలా ఉంటే భారత్లో దాదాపు 560 రాజ్యాలను విలీనం చేయడంలో నాడు తొలి హోంమంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి ఎంతో ఉంది. ఇదిలా ఉంటే కశ్మీర్కు చెందిన విద్యార్థులు, లేదా ప్రజలు చదువుకునేందుకు డెహ్రాడూన్, జమ్మూ, కోల్కతా, ముజఫర్ నగర్లకు వెళ్లగా అక్కడ చిత్ర హింసలకు గురయ్యారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ చిత్ర హింసలను భరించలేక తిరిగి తమ రాష్ట్రానికి వెళ్లారు.
పుల్వామా ఉగ్రదాడిలో 40 సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యాక... భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులను చులకన భావంతో చూస్తున్నారన్న ఘటనలు వెలుగు చూశాయి. అంతేకాదు ఆ విద్యార్థులను చిత్రహింసలకు కూడా గురిచేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి.