నోట్ల రద్దు.. వారికి చివరి అవకాశం: మోడీ, రాజీవ్ గాంధీ తెస్తే ఎక్కడున్నాయి?
బినామీ ఆస్తులు కూడబెట్టిన వారికి ఇది చివరి అవకాశమని, తప్పు చేస్తే అంగీకరించాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
న్యూఢిల్లీ: బినామీ ఆస్తులు కూడబెట్టిన వారికి ఇది చివరి అవకాశమని, తప్పు చేస్తే అంగీకరించాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మొబైల్ ద్వారా లావాదేవీలు అంటే కాంగ్రెస్ ఫోన్లు ఎక్కడివి అంటుందని, మరి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఫోన్లు ఎక్కడివని ప్రశ్నించారు. ప్రధాని మోడీ పార్లమెంటులో మాట్లాడారు.
బినామీ చట్టాన్ని తొక్కి పడేశారు
బినామీ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తొక్కిపడేసిందన్నారు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది కాబట్టే పెద్ద నోట్లను రద్దు చేశామని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంటే అలాంటి నిర్ణయాలు తీసుకోలేమని చెప్పారు.
నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ స్వచ్ఛంగా మారిందని చెప్పారు. బినామీ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. తమకు (బీజేపీ) ఎన్నికలు అంటే ఎలాంటి భయం లేదని, తమ ఆలోచన అంతా దేశం గురించేనని చెప్పారు.
ప్రజాశక్తి విలువ తెలియదు
కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రజాశక్తి విలువ తెలియదని చెప్పారు. కాంగ్రెస్కు టీవీల్లో కనిపించాలనే తపన ఎక్కువ అని ఎద్దేవా చేశారు. నల్లధనం దాచిన వారికి ఇదే చివరి అవకాశమని చెప్పారు.
వాళ్లు తప్పు అంగీకరించాల్సిందే.. ఒక్కో దారి మూసేస్తున్నాం
బినామీ ఆస్తులు కూడబెట్టిన వాళ్లు చేసిన తప్పు అంగీకరించాలన్నారు. బినామీ చట్టం కూడా నోటిఫై అయిందని, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పటి వరకు చాలామంది దొంగ మార్గంలో ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టారన్నారు.
బినామీ చట్టంపై ఆందోళన చెందేవారు మీ చార్టెడ్ అకౌంటును కలవాలని మోడీ సూచించారు. ఇప్పుడు బినామీ ఆస్తులు ఉన్న వారికి చివరి అవకాశమని, వెలుగులోకి రావాలన్నారు.
ఆ దేశాలకు చెప్పాం
మారిషస్, సింగపూర్, స్విట్జర్లాండ్ తదితర దేశాలకు వాస్తవ పరిస్థితిని వివరించామని చెప్పారు. భారతీయ నగదుపై తగిన సమాచారం ఇచ్చేందుకు ఒప్పించామని చెప్పారు.
బంగారంపై ముందుకే వెళ్లాం
బంగారం కొనుగోలు విషయంలో పాన్ నెంబర్ అవసరం లేదని చాలామంది సూచనలు చేశారని, కానీ ఎవరి మాటా వినవద్దని నిర్ణయించుకున్నామని, అందుకే ముందుకు వెళ్లామని చెప్పారు. ఒక్కో దారిని మూసేస్తున్నామని, ప్రతి వారు దారికి రావాల్సిందే అన్నారు.
రాజీవ్ తెచ్చిన ఫోన్లు ఎక్కడికి పోయాయి
ధర్మాధర్మ విచక్షణలు కాంగ్రెస్ పార్టీకి తెలుసునని, కానీ దానిని విడిచిపెట్టే ప్రయత్నం చేయరని ఎద్దేవా చేశారు. రాజీవ్ గాంధీ ఫోన్లు తెచ్చారు, మొబైల్స్ తెచ్చారు.. అని కాంగ్రెస్ పార్టీ చెబుతుందని, దేశమంతటినీ ఫోన్ బ్యాంకింగ్ చేద్దామంటే మాత్రం.. అదే కాంగ్రెస్ పార్టీ ఫోన్లు ఎక్కడివి అని ప్రశ్నిస్తుందని, మరి రాజీవ్ తెచ్చిన ఫోన్లన్నీ ఎక్కడికి పోయాయన్నారు.
ఏడాదిలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ చేశామని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా పనికి ఆహార పథకం కొనసాగించలేని పరిస్థితి మనది అన్నారు. 76వేల గ్రామాలను ఓఎఫ్సీతో అనుసంధానం చేశామని, ఇది తమ విజయం కాదా అని నిలదీశారు.
బీమ్ యాప్ ద్వారా వ్యాపారులకు, వినియోగదారులకు అందరికీ ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.