పాక్ వెళ్లి.. నవాజ్ షరీఫ్ ను కౌగిలించుకున్నదెవరు?: మోడీకి సోనియా సూటి ప్రశ్న
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తలెత్తిన వ్యతిరేక ప్రదర్శనలు, నిరసన జ్వాలల నేపథ్యంలో.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు తన విమర్శలకు మరింత పదును పెట్టారు. తీవ్రతను పెంచారు. పౌరసత్వ సవరణ చట్టం అమలు తరువాత దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దృష్టికి తీసుకెళ్లారు.
సోనియా గాంధీ సారథ్యంలో..
ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీ సారథ్యంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో భేటీ అయ్యారు. వినతిపత్రాన్ని అందజేశారు. సోనియాగాంధీ సహా కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటొనీ, ఆనంద్ శర్మ, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, ఏబీ బర్దన్ తదితరులు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆయనను కలుసుకున్నారు. దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో పాటు, జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై లాఠీ ఛార్జీ, తదనంతర పరిణామాలను వారు రాష్ట్రపతికి వివరించారు.
నరేంద్ర మోడీపై కౌంటర్ అటాక్
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెలరేగుతోన్న హింసాత్మక పరిస్థితుల వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని, పాకిస్తానీయులకు కూడా భారత పౌరసత్వాన్ని ఇస్తామనే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ నేతలకు ఉందా? అని జార్ఖండ్ ఎన్నికల ప్రచార సభలో సవాల్ విసిరిన నరేంద్ర మోడీపై ఎదురు దాడికి దిగారు కాంగ్రెస్ నాయకులు. పాకిస్తానీయులకు భారత పౌరసత్వాన్ని కల్పించే విషయాన్ని అటు ఉంచితే.. ఆ దేశం మెప్పును పొందడానికి నరేంద్ర మోడీ ప్రయత్నించారని ఆరోపించారు.
నవాజ్ షరీఫ్ తో కలిసిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ..
నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పాకిస్తాన్ కు వెళ్లిందెవరని సోనియాగాంధీ, కపిల్ సిబల్ ప్రశ్నించారు. షెడ్యూల్ లో లేకపోయినప్పటికీ.. ప్రొటోకాల్ కు భిన్నంగా నరేంద్ర మోడీ.. అదే పనిగా పాకిస్తాన్ కు వెళ్లారని ప్రశ్నించారు. నవాజ్ షరీఫ్ ను కౌగిలించుకున్నది ఎవరు? అని నిలదీశారు. 2015లో నరేంద్ర మోడీ.. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆయన అధికారిక నివాసం రైవిండ్ పటియాలా హౌస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రస్తావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఆందోళనలు..
పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసిన అనంతరం ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగిన హింసాత్మక పరిస్థితులు న్యూఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయని సోనియాగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నియంత్రించడానికి తక్షణ చర్యలు చేపట్టడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం.. ప్రతిపక్షాలను విమర్శించడంలో అర్థం లేదని అన్నారు. జామియా విద్యార్థులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు.