ఆర్టికల్ 35 ఏపై కేంద్రం స్పష్టమైన వైఖరి తెలపాలి..లేదంటే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తాం: ఫరూక్
జమ్ముకశ్మీర్ : జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 35ఏ పై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ స్పష్టమైన వైఖరిని తెలపకుంటే ఆ రాష్ట్రంలో జరగనున్న స్థానిక ఎన్నికలను నిషేధిస్తామని హెచ్చరించారు ఎన్సీపీ అధినేత ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఆర్టికల్ 35 ఏపై జోక్యం చేసుకుంటే తమ పార్టీ తుదికంటా పోరాడుతుందని ఫరూక్ తెలిపారు. ఆర్టికల్ 35 ఏ పై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరిరక్షిస్తాయని స్పష్టంగా కోర్టుకు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని తెగేసి చెప్పారు.
జమ్ముకశ్మీర్లో ప్రస్తుత పరిస్థితిపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కీలక సమావేశం నిర్వహించిందని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆర్టికల్ 35 ఏపై జోక్యం చేసుకుంటే రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందని చెప్పారు అబ్దుల్లా. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అదే ప్రయత్నాలు చేస్తోందని సుప్రీంకోర్టులో ఈ అంశం పెట్టిందని చెప్పిన ఫరూక్... ఇది పూర్తిగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని మరో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. జమ్ము కశ్మీర్లో ఆ రాష్ట్రానికి చెందినవారికే ఉద్యోగాలు, ఆస్తులపై హక్కు కల్పిస్తున్న చట్టంలో జోక్యం చేసుకోరాదని అన్నారు. పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలు సాకుగా చూపి ఆర్టికల్ 35కు సంబంధించిన వాదనలను సుప్రీంకోర్టులో జాప్యం చేయడం సరికాదన్నారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరపున మాట్లాడిన అడిషనల్ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా... ఈ సమయంలో 35 ఏ ఆర్టికల్పై చర్చ రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ప్రభావం చూపుతుందన్నారు. 4500 సర్పంచ్, 1145 వార్డుమెంబర్లకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వివాదాస్పదమైన అంశాన్ని చర్చకు తీసుకురాకపోవడమే మంచిదని తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలకు గతవారమే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ మొదటి వారం వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరపాలన్న ఈ నిర్ణయం గవర్నర్ నేతృత్వంలో రాష్ట్ర పాలనా సమాఖ్య తీసుకుంది.