కర్నాటకలో జేడీఎస్ తరహాలో అజిత్ జోగి ఛత్తీస్గఢ్ చక్రం తిప్పుతారా..?
ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం జనతా కాంగ్రెస్ అధినేత అజిత్ జోగి. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఓట్లు శాతం తేడా కేవలం 0.75శాతంగానే ఉన్నింది. చాలా వరకు గెలిచిన సీట్లు అతి తక్కువ మార్జిన్తో గెలవడం జరిగింది. అయితే ఈ సారి అజిత్ జోగి పార్టీ జనతా కాంగ్రెస్ మాయావతి పార్టీ బీఎస్పీ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగనుంది. అయితే అజిత్ జోగి పెద్దగా సీట్లు గెలవకపోయినప్పటికీ కాంగ్రెస్ ఓట్లు చీల్చే సత్తా ఉంది. అయితే కాంగ్రెస్ ఓట్లు చీల్చడం ద్వారా బీజేపీకి అజిత్ సింగ్ మేలు చేకూరుస్తున్నారా..? రమణ్ సింగ్, సోనియాగాంధీలతో అజిత్ సింగ్ లెక్కలు ఎలా ఉన్నాయి...?
రెండు పార్టీల ఓట్లు చీలుస్తాను: అజిత్ జోగి
ఛత్తీస్గఢ్ రెండో దశ ఎన్నికలు ఈ నెల 20న జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఇక్కడ ప్రచారం ఊపందుకుంది. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ నెలకొనగా... మూడో పార్టీగా అజిత్ సింగ్ పార్టీ జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ బరిలో నిలుస్తోంది. ప్రజలు మూడో ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని అది జనతా కాంగ్రెస్ అవుతుందని తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అజిత్ జోగి ఆత్మ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీచేస్తున్నట్లు చెప్పిన అజిత్ జోగి బీజేపీకి చేదు అనుభవం తప్పదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఓట్లు చీల్చడం ద్వారా బీజేపీకి మేలుచేస్తున్నారన్న ప్రశ్నకు ... తాను రెండు పార్టీల ఓట్లు చీలుస్తున్నానని అయితే కాంగ్రెస్లో అంతకుముందు ఉండగా ఆ ఓట్లే కొన్ని ఎక్కువగా చీలుతాయని అజిత్ జోగి చెప్పారు.
హంగ్ వస్తే అప్పుడు ఆలోచిస్తాం
ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్ తనపై లేనిపోని ఆరోపణలు చేశారని తనను దొంగలా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశాడని గుర్తుచేసిన అజిత్ సింగ్...తన కుటుంబాన్ని వేధించాడని చెప్పాడు. తనపై నేరాలు మోపుతూ కోర్టుల్లో సైతం పిటిషన్లు దాఖలు చేశాడని అయితే ఆ కేసులను కోర్టుకొట్టివేసి మొట్టికాయ వేసిందని చెప్పారు. తన కొడుకుపై హత్యాయత్నం కేసు బనాయించి జైలుకు పంపారని అయితే కింది కోర్టు నిర్దోషిగా పేర్కొనడంతో రమణ్ సింగ్ హైకోర్టుకు వెళ్లాడని గుర్తు చేశారు. అక్కడా చుక్కెదురు అవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడని అక్కడా తన కేసు నిలబడలేదని చెప్పిన అజిత్ జోగి... ఇక్కడితో ఆగకుండా చివరికి రాజ్యాంగ ధర్మాసనం ముందు పిటిషన్ వేశారని ధ్వజమెత్తారు. ఇవి చాలామందికి తెలియని సత్యాలని చెప్పారు. అయితే ఒకవేళ హంగ్ ఏర్పడితే అప్పుడు ఆలోచిస్తామని చెప్పిన అజిత్ జోగి ఇప్పటికైతే ఎవరికి మద్దతు తెలపబోమని ప్రకటించారు.
ధనిక రాష్ట్రంలో ప్రజలు పేదవారిగానే మిగిలిపోయారు
ఇదిలా ఉంటే అజిత్ జోగి ఎక్కువగా దళితులు, గిరిజనుల ఓటు బ్యాంకుపైనే ఆధారపడి ఉన్నారు. ఛత్తీసగఢ్ రాష్ట్రం ఖనిజ రాష్ట్రమని చెప్పిన అజిత్ జోగి... రెండు జాతీయ పార్టీలు ఈ రాష్ట్రానికి న్యాయం చేయలేకపోయాయని చెప్పారు. తమ దగ్గర వజ్రాలు, బంగారం ఉన్నప్పటికీ ఏమీ చేయలేక పోయాయని ధ్వజమెత్తారు. యురేనియం నిక్షేపాలు కూడా ఉన్నాయి..కానీ దాన్ని కూడా వినియోగించలేకపోయారు. ప్రపంచంలోనే నాణ్యమైన ఇనుప ఖనిజాలు ఉన్నప్పటికీ వాటిని జపాన్, చైనాకు తరలించారు తప్పితే తమ రాష్ట్ర బాగుకోసం వినియోగించుకోవడంలో కాంగ్రెస్ బీజేపీలు విఫలమయ్యాయి అని మండిపడ్డారు. భారత్లో ఉత్పత్తి అవుతున్న సిమెంటులో 25శాతం ఛత్తీస్గఢ్లోనే తయారు అవుతుందన్న జోగి... దేశంలోనే ధనిక రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న ఛత్తీస్గడ్లో 50శాతానికి పైగా ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడైతే నిర్ణయాలు ఢిల్లీ నుంచి కాకుండా... ప్రాంతీయ పార్టీలు నిర్ణయిస్తాయో అప్పుడే పేద ప్రజలతో ఉన్న ధనిక రాష్ట్రం నిజమైన ధనిక రాష్ట్రంగా రూపాంతరం చెందుతుందన్నారు.