దేశాన్ని కాదు, బీజేపీని విచ్ఛిన్నం చేస్తాం, జేఎన్యూ ఘటనపై కన్హయ్య కుమార్
జేఎన్యూలో విద్యార్థులు, టీచర్లపై దాడిచేసిన వారిపై వ్యతిరేకిస్తూ నిరసన తెలిపేవారు దేశాన్ని విచ్ఛిన్నం చేయలేరని, కానీ బీజేపీని మాత్రం విచ్చిన్నం చేస్తారని జేఎన్యూ విద్యార్థి విభాగం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అన్నారు. ఈ నెల 5వ తేదీన వర్సిటీలో జరిగిన దాడికి సంబంధించి గురువారం మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులకు కన్హయ్య కుమార్ నేతృత్వంలోని బృందం ఫిర్యాదు చేసింది.
బీజేపీ నేతలు తమను 'తుక్డే తుక్డే గ్యాంగ్' అని పిలుస్తున్నారు. ఔను మేం తుక్ డే తుక్ డే గ్యాంగ్ అని.. మేం దేశాన్ని విచ్ఛిన్నం చేయం, బీజేపీని విభజిస్తామని పేర్కొన్నారు. 2014కి ముందు ఇలాంటి పరిస్థితి లేదని గుర్తుచేశారు. తుక్ డే తుక్ డే అనే పదాన్ని వేర్పాటువాదులకు సంబంధించి సానుభూతిపరులను సూచించడానికి బీజేపీ ఉపయోగిస్తోంది.
బీజేపీ ప్రభుత్వంలో జేఎన్యూ ప్రతిష్ట దిగజారుతోందన్నారు. అంతేకాదు జేఎన్యూ ఘటనలో గాయపడ్డ విద్యార్థులను నటి దీపికా పదుకొనే పరామర్శించారు. అంతే బీజేపీ మద్దతుదారులు ఆమె సినిమాను బహిష్కరించాలని పిలుపునివ్వడం వారి ప్రవర్తనకు అద్దం పడుతుందని విమర్శించారు. దీపికా ఘటనపై స్పందించారే తప్ప.. పార్టీని, ప్రభుత్వాన్ని ఏమీ అనలేదని చెప్పారు. అలాంటప్పుడు సినిమా ఎందుకు బ్యాన్ చేయాలని పిలుపునిస్తారని కన్హయ్య కుమార్ ప్రశ్నించారు. ఈ ఘటన వెనక కేంద్ర ప్రభుత్వం ఉందని, వీసీ వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయని చెప్పారు.