సీఎం సిద్ధరామయ్య ఇంటిని పేల్చేస్తున్నామని బెదిరింపు ఫోన్
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇంటిలో బాంబు పెట్టామని బెదిరింపు ఫోన్ చేసిన వ్యక్తిని బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలోని హోన్నారపేటలో నివాసం ఉంటున్న రాజు (43) అనే వ్యక్తిని అరెస్టు చేశామని పోలీసులు అన్నారు.
ఇతను ఇదే సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదిన రాత్రి సుమారు 7.30 గంటల ప్రాంతంలో పోలీస్ కంట్రోల్ రూం 100కు ఫోన్ చేశాడు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నివాసం కావేరిలో బాంబు పెట్టామని, నిమిషాలలో పేలిపోతుందని కన్నడలో బెదిరించి ఫోన్ కట్ చేశాడు.
హడలిపోయిన పోలీసు అధికారులు బాంబు నిర్వీర్యదళం టీంలు, పోలీసు జాగిలాలతో సిద్దరామయ్య ఇంటికి చేరుకున్నారు. ఇల్లు, బయట ఆవరణంలో క్షుణ్ణంగా గాలించారు. ఎలాంటి బాంబు కనపడకపోవడంతో పోలీసు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
బెదిరింపు ఫోన్ వచ్చిన ప్రాంతాన్ని పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసే సమయంలో రాజు తప్పించుకున్నాడు. అనంతరం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలోని వివిద ప్రాంతాలలో తలదాచుకున్నాడు. ఆదివారం రాత్రి బెంగళూరు చేరుకున్న రాజును పోలీసులు అరెస్టు చేశారు. అతను అలా ఎందుకు ఫోన్ చేశాడో తెలుసుకనేందుకు పోలీసులు విచారిస్తున్నారు.