దాడిని మరిచిపోం, వారిని వదలం: సీఆర్పీఎఫ్, స్వేచ్ఛఇచ్చిన మోడీ.. సర్జికల్ స్ట్రయిక్ 2 ఉంటుందా?
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన తీవ్రవాద దాడి నేపథ్యంలో.. ఈ దాడిని మరిచిపోయేది లేదని, వారిని క్షమించేది లేదని సీఆర్పీఎఫ్ పేర్కొంది. ఈ మేరకు ట్వీట్ చేసింది. గురువారం జరిగిన ఉగ్రదాడిలో నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. దీనిని యావత్ భారతదేశంతో పాటు, ప్రపంచం ఖండిస్తోంది. పాకిస్తాన్ను ఏకాకి చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది.
ఈ దాడిని మరిచిపోము, వదిలిపెట్టం
ఈ ఆత్మాహుతి దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. జవాన్ల మరణానికి సీఆర్పీఎఫ్ సానుభూతి తెలియజేసింది. 'మేం దీనిని మరిచిపోము. మేం వారిని క్షమించం. పుల్వామా దాడిలో అమరులైన వారికి సెల్యూట్ చేస్తున్నాం. అమరులైన సోదరుల కుటుంబాలకు అండగా నిలుస్తాం. ఈ హేయమైన చర్యకు ప్రతీకారం తీర్చుకుంటాం' అని తెలిపింది.
మరో సర్జికల్ స్ట్రయిక్స్
పుల్వామా దాడిలో నలభై మందికి పైగా జవాన్లు అమరులు కావడంతో దేశం యావత్తు మరో సర్జికల్ స్ట్రయిక్స్ కావాలని డిమాండ్ చేస్తోంది. ఉగ్రవాదులను, వారిని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ను వదిలి పెట్టవద్దని చెబుతోంది. వారిని చంపేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2016లో యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపి 18 మంది జవాన్ల ప్రాణాలను బలితీసుకున్నారు. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్థాన్పై సర్జికల్ స్ట్రయిక్స్ చేసింది. ఇప్పుడు మరో సర్జికల్ స్ట్రయిక్ అవసరమని అంటున్నారు.
పుల్వామా దాడి: పాక్ హైకమిషనర్కు భారత్ సమన్లు, పాక్ విదేశాంగ శాఖ వివరణ తిరస్కరణ
భద్రతా దళాలకు మోడీ పూర్తి స్వేచ్ఛ
యూరి దాడి ఘటన జరిగినప్పుడు మోడీ మాట్లాడుతూ.. ఈ ఘటనను భారత్ మరిచిపోదని, ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పారు. ఇప్పుడు కూడా ఆయన ఒకటికి రెండుసార్లు అదే చెప్పారు. అమరవీరుల త్యాగం వృథాకాదని, 130 కోట్ల మంది భారతీయులు పాక్కు దీటైన జవాబిస్తారని చెప్పారు. ఇందుకు పాక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే అత్యంత అభిమాన దేశాల జాబితా నుంచి పాకిస్తాన్ను తొలగిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. యూరి ఘటనకు ప్రతీకారంగా ఎవరూ ఊహించని విధంగా పాకిస్తాన్ పైన సర్జికల్ స్ట్రయిక్స్ చేసి ఆదేశానికి బుద్ధి చెప్పింది. ఇప్పుడు పాక్పై ఎప్పుడు, ఎలా, ఏ సమయంలో ప్రతీకారం తీర్చుకోవాలనేది సైన్యానికి వదిలిపెడుతున్నానని, అందుకు అన్ని అనుమతులు ఇస్తున్నట్లు మోడీ తెలిపారు. వాళ్లకు ఎలా బుద్ధి చెబుతారో మీ ఇష్టం అంటూ భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు.