ఉప ఎన్నికలకు సిద్దం: అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు, పళని, పన్నీర్ కు చాలెంజ్ !
చెన్నై: తమిళనాడులోని ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన అన్నాడీఎంకే పార్టీకి చెందిన 18 మంది రెబల్ ఎమ్మెల్యేలు తాము ఉప ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని, దేనికైనా రెడీగా ఉన్నామని అంటున్నారు. మా మీద అనర్హత వేటు వేసిన స్పీకర్ ధనపాల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.
టీటీవీ ముఖ్య అనుచరుడు
అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న టీటీవీ దినకరన్ ముఖ్య అనుచరుడు తంగ తమిళ సెల్వన్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ప్రభుత్వం మీద మాత్రమే తాము తిరుగుబాటు చేశామని అన్నారు.
అన్నాడీఎంకే పార్టీ !
అన్నాడీఎంకే పార్టీ మీద తాము తిరుబాటు చెయ్యలేదని, ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం నేతృత్వంలోని ప్రభుత్వం మీద మాత్రమే తిరుగుబాటు చేశామని, మా దగ్గర ఎలాంటి వివరణ తీసుకోకుండా స్పీకర్ ధనపాల్ ఏకపక్షంగా వ్యవహరించారని రెబల్ ఎమ్మెల్యే తంగ తమిళ సెల్వన్ చెప్పారు.
ఉప ఎన్నికలకు రెడీ
తమ మీద అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని, అన్నాడీఎంకే అమ్మ పార్టీ పేరుతో ఉప ఎన్నికల బరిలో దిగుతామని తంగ తమిళ సెల్వన్ అన్నారు. ఉప ఎన్నికల్లో 18 మంది రెబల్ ఎమ్మెల్యేలు విజయం సాధిస్తారని తంగ తమిళ సెల్వన్ ధీమా వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు !
తమిళనాడులో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకే అమ్మ పార్టీ (టీటీవీ దినకరన్ వర్గం) అన్ని చోట్లా పోటీ చేసి అధిక సీట్లలో విజయంసాధించి అధికారంలో ఉన్న ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ప్రభుత్వానికి సినిమా చూపిస్తామని తంగ తమిళ సెల్వన్ చాలెంజ్ చేశారు.
టీటీవీ వెంటే ఉంటాం !
ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ వెంటే తాము ఉంటామని, తమిళనాడు ప్రభుత్వానికి ఎలాంటి పరిస్థితిలో మద్దతు ఇవ్వమని అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యే తంగ తమిళ సెల్వన్ స్పష్టం చేశారు. ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం నేతృత్వంలోని ప్రభుత్వం రెండు నెలల్లో కుప్పకూలిపోతుందని తంగ తమిళ సెల్వన్ జోస్యం చెప్పారు.