మావోయిస్టుల ట్రాప్.. పసిగట్టలేక పోయిన యంత్రాంగం.. 16 మంది పోలీసుల మృతి
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ప్రత్యేక పోలీసు బలగాలపై మావోయిస్టుల దాడి పక్కా ప్రణాళిక ప్రకారమే చోటు చేసుకుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మావోయిస్టులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవరించారని తెలుస్తోంది. ఈ విషయంలో మావోయిస్టులు పోలీసుల ఎత్తులను చిత్తు చేశారని అర్థమౌతోంది. మావోయిస్టులను ఏమార్చడానికి పోలీసులు ఓ ప్రైవేటు వాహనాన్ని ఉపయోగించారు. అయినప్పటికీ.. వారి నుంచి తప్పించుకోలేకపోయారు. అత్యంత శక్తిమంతమైన ఐఈడీ ద్వారా మావోయిస్టులు ప్రత్యేక పోలీసుల వాహనాన్ని పేల్చివేశారు. ఐఈడీ ఎంత శక్తిమంతమైనదంటే.. వాహనం తునాతునకలైపోయింది. ఇంజిన్ ఆనవాళ్లు కూడా మిగల్లేదు.
గడ్చిరోలి..మావోయిస్టుల పట్టు
మహారాష్ట్రలో మావోయిస్టులకు గట్టిపట్టు ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే.. అది గడ్చిరోలి జిల్లా మాత్రమే. మొదటి నుంచీ ఈ జిల్లాను తమకు అనుకూలంగా మార్చుకున్నారు మావోయిస్టులు. దీనికి ప్రధాన కారణం- ఛత్తీ్ గఢ్ ను ఆనుకుని ఉండటమే. భౌగోళికంగా- ఛత్తీస్ గఢ్ లోని దండకారణ్యం గడ్చిరోలి జిల్లాలో కూడా విస్తరించి ఉంది. దండకారణ్యాన్ని తమ స్థావరంగా మార్చుకున్న విషయం తెలిసిందే. దంతెవాడ, సుక్మా, బస్తర్ జిల్లాల్లో దండకారణ్యం మొత్తాన్నీ మావోయిస్టులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అలాంటి రాష్ట్రానికి సరిహద్దులను పంచుకుంటున్న గడ్చిరోలి జిల్లాలో కూడా తమ కార్యకలాపాలను విస్తరించుకున్నారు మావోయిస్టులు.
పోలీసులను ఊరించి..బలి గొన్నారు
కుర్ ఖేడా తాలూకా పరిధిలోని మారుమూల గ్రామంలో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి కొన్ని ప్రైవేటు వాహనాలను దగ్ధం చేసిన విషయం తెలిసిందే. రోడ్డు నిర్మాణ పనుల కోసం తీసుకొచ్చిన వాహనాలను పెట్రోలు, కిరోసిన్ పోసి తగులబెట్టారు మావోయిస్టులు. సుమారు 32 వాహనాలను వారు మంటల్లో అహూతి చేశారు. ఈ ఘటన అనంతరం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుంటారని మావోయిస్టులు ముందే ఊహించి ఉంటారని అనుమానిస్తున్నారు. వాహనాలను తగులబెట్టిన సంఘటన అనంతరం- ఎంపిక చేసిన మార్గంలో పోలీసులు గానీ భద్రతా బలగాలు గానీ ఖచ్చితంగా రాకపోకలు సాగిస్తారని భావించారు. దీనికి అనుగుణంగా స్కెచ్ వేశారు మావోయిస్టులు. వారిని ఊరించి, బలిగొన్నారు.
ప్రైవేటు వాహనంలో వెళ్లినా..
మావోయిస్టులకు గట్టి పట్టు ఉన్న ప్రాంతాల్లో గానీ, కూంబింగ్ కు వెళ్తున్న సమయంలో గానీ పోలీసులు కొన్ని ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటారు. మావోయిస్టులను ఏమార్చడానికి ప్రైవేటు వాహనాల్లో రాకపోకలను సాగిస్తుంటారు. బుధవారం మధ్యాహ్నం క్విక్ రెస్పాన్స్ టీమ్ కు చెందిన ప్రత్యేక బలగాలు కుర్ ఖేడా పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి ప్రైవేటు వాహనాన్నే ఉపయోగించారు. ఎం హెచ్ 33 టీ 0483 అనే వాహనంలో వారు బయలుదేరారు. మావోయిస్టులు తగులబెట్టిన వాహనాలను పరిశీలించిన అనంతరం.. కూంబింగ్ చేపట్టాలనేది వారి వ్యూహం. దీని ప్రకారమే క్విక్ రెస్పాన్స్ టీమ్ కు చెందిన పోలీసులు వ్యవహరించారు. తమ వాహనాల్లో వెళ్తే మావోయిస్టుల కంటికి చిక్కొచ్చని ముందే ఊహించి, ప్రైవేటు వాహనాన్ని వినియోగించారు. అయినప్పటికీ- మావోయిస్టులను ఏమార్చలేకపోయారు. రోడ్డు పక్కన ముందే పూడ్చిపెట్టిన శక్తిమంతమైన ఐఈడీని పేల్చడం ద్వారా పోలీసుల ప్రాణాలను హరించి వేశారు.
ఐఈడీ ఎక్కడి నుంచి వచ్చింది?
సాధారణంగా మావోయిస్టులు ఎప్పుడు దాడి చేసినా.. మందుపాతరలను వినియోగిస్తారు. వాటితోనే విధ్వంసాన్ని సృష్టిస్తారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ, సుక్మా జిల్లాల్లో మందుపాతరలతో సీఆర్పీఎఫ్, పోలీసుల వాహనాలను పేల్చి వేసిన ఘటనలు చాలా ఉన్నాయి. ఈ సారి మావోయిస్టులు శక్తిమంతమైన ఐఈడీలను వినియోగించడం పట్ల పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. పెద్ద ఎత్తున ఐఈడీని మావోయిస్టులు ఎలా సమకూర్చుకున్నారనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఐఈడీ మావోయిస్టులకు ఎలా చేరిందనే విషయంపైనా వారు దర్యాప్తు చేస్తున్నారు.
దెబ్బకు దెబ్బ తీస్తాం: మహారాష్ట్ర డీజీపీ
మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటామని మహారాష్ట్ర డీజీపీ సుబోధ్ జైస్వాల్ తెలిపారు. సంఘటన చోటు చేసుకున్న అనంతరం ఆయన ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దాడికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. క్విక్ రెస్పాన్స్ టీమ్ కు చెందిన 15 మంది పోలీసులు, ఓ డ్రైవర్ దుర్మరణం పాలయ్యారని తెలిపారు. పోలీసులు ప్రైవేటు వాహనంలో కుర్ ఖేడా పోలీస్ స్టేషన్ కు వెళ్తుండగా మావోయిస్టులు మందుపాతరను పేల్చేశారని అన్నారు. దీనిపై తాము దెబ్బకు దెబ్బ తీస్తామని చెప్పారు. మావోయిస్టుల కోసం కూంబింగ్, సెర్చ్ ఆపరేషన్ లను కొనసాగిస్తున్నామని డీజీపీ స్పష్టం చేశారు.