తెరిచిన పుస్తకం, బాధ్యత వహిస్తున్నా: మన్మోహన్
న్యూఢిల్లీ: తన జీవితం తెరిచిన పుస్తకమని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. కాంగ్రెసు ఓటమికి బాధ్యత వహిస్తున్నానని ఆయన అన్నారు. ప్రధానిగా ఇదే తన చివరి మీడియా సమావేశమని ఆయన అన్నారు. ప్రజల తీర్పును శిరసా వహిస్తున్నట్లు తెలిపారు. రాబోయే ప్రభుత్వానికి విజయాలు కలగాలని ఆశిస్తున్నట్లు ఆయన శనివారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
దేశానికి సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టమని ఆయన చెప్పారు. పదేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. భారత్ సూపర్ పవర్గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మన్మోహన్ సింగ్ మీడియా సమావేశంలో క్లుప్తంగా మాట్లాడారు.
ప్రజల తీర్పును ప్రతి ఒక్కరం గౌరవించాలని ఆయన అన్నారు. తనకు ఇంత కాలం సహకరించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని శనివారం సాయంత్రం కలిసి రాజీనామా సమర్పిస్తారు. మన్మోహన్ మంత్రివర్గ సభ్యులకు రాష్ట్రపతి సాయంత్రం విందు ఇస్తారు.
మన్మోహన్ సింగ్ చివరి మంత్రివర్గ సమావేశం శనివారం జరుగుతుంది. 15వ లోకసభను రద్దు చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేస్తారు. కాంగ్రెసు లోకసభ ఎన్నికల్లో రెండంకెల సీట్లకు పరిమితం అయింది. ఇంత దారుణంగా కాంగ్రెసు ఫలితాలు సాధించిన దాఖలాలు లేవు.