డేటా చోరీపై ఫిర్యాదులు: అధ్యయనం చేస్తాం: నివేదిక అందిన తరువాతే..
న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని అట్టుడికిస్తోన్న డేటా చోరీ ఉదంతంపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా స్పందించారు. దీనిపై అధ్యయనం చేస్తామని అన్నారు. వీలైనంత త్వరగా నివేదికలను తెప్పించుకుంటామని స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సునీల్ అరోరా మాట్లాడారు. డేటా చోరీపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన క్లుప్తంగా సమాధానం ఇచ్చారు.
డేటా చోరీని పట్టించుకోని ఎన్నికల సంఘం: ఏపీ ఓటర్ల తుది జాబితా ఇదే
ఎన్నికల నోటిఫికేషన్ తో పాటు రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. డేటా చోరీపై తమకు ఫిర్యాదులు అందాయని అన్నారు. పెద్ద ఎత్తున ఓట్లను తొలగించినట్లు సమాచారం అందిందని, దీనిపై దృష్టిపెడతామని చెప్పారు.
దీనిపై తాము ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులను ఇదివరకే సంప్రదించామని అన్నారు. వారి నుంచి సమాచారం అందిన తరువాత, అధ్యయనం కోసం ప్రత్యేకంగా ఓ బృందాన్ని పంపిస్తామని సునీల్ అరోరా వెల్లడించారు. రాష్ట్రాల ప్రధాన ఎన్నికల కమిషనర్లు, ప్రత్యేక బృందం ద్వారా అందిన నివేదికలను క్రోడీకరించి, తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.