కశ్మీర్కు పంపుతాం జాగ్రత్త: రోడ్డు గొడవలో కశ్మీర్ జర్నలిస్టుపై యువత దాడి
పూణే: పుల్వామా ఉగ్రదాడుల తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న కశ్మీరీలపై దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. తాజాగా కశ్మీర్కు చెందిన ఓ 24 ఏళ్ల యువ జర్నలిస్టును కొందరు చితకబాదారు. అయితే ఇది చిన్న గొడవ కారణంగా జరిగిన ఘటన అని పోలీసులు చెప్పారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జరిగిన గొడవలో ఆయన్ను చితకబాదారని పోలీసులు తెలిపారు.
పూణేలో ఓ పత్రిక సంస్థలో పనిచేస్తున్న జిబ్రాన్ నజీర్ అనే జర్నలిస్టుతో కొందరు గొడవపడ్డారు. ఎక్కువగా మాట్లాడితే కశ్మీర్కు పంపుతామనే వ్యాఖ్యలు కూడా వారు చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఈ గొడవకు పుల్వామా ఉగ్రదాడుల తర్వాత కశ్మీరీలపై కొనసాగుతున్న దాడులకు సంబంధం లేదని ఇది ఒక చిన్న వాగ్వాదంతో తలెత్తిన వివాదమని చెప్పారు.
పుల్వామాలో దాడుల తర్వాత యవత్మాల్లోని ఓ కాలేజీలో కశ్మీరి విద్యార్థులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. శివసేన అనుబంధ సంస్థ యువసేన కార్యకర్తలు కశ్మీరీ విద్యార్థులపై దాడి చేశారు. ఇదిలా ఉంటే... తాజాగా కశ్మీరి జర్నలిస్టుపై దాడి జరగడం కలకలం రేపుతోంది. తన స్కూటరుపై రాత్రి 10 గంటల 45 నిమిషాలకు తన ఇంటికి వెళుతున్న సమయంలో కొందరు తనపై దాడి చేశారని నజీర్ వెల్లడించాడు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తను ఆగిఉంటే... ఇద్దరు వ్యక్తులు వెనక నుంచి హారన్ కొట్టి పక్కకు జరగాల్సిందిగా చెప్పారని... ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు ఎలా వెళతారని చెప్పడంతో వాగ్వాదం మొదలైనట్లు నజీర్ చెప్పాడు. అయితే మోటర్బైక్ పై రిజిస్ట్రేషన్ నెంబరు హిమాచల్ ప్రదేశ్ అని ఉండటంతో అక్కడికి పంపించేస్తామని బెదిరించినట్లు నజీర్ తెలిపాడు.
అయితే తను హిమాచల్ ప్రదేశ్కు చెందిన వ్యక్తిని కాదని జమ్ము కశ్మీర్కు చెందిన వ్యక్తినని చెప్పడంతో తనపై దాడి చేసినట్లు నజీర్ చెప్పాడు. నీ జర్నలిజం అక్కడే చేసుకో కశ్మీర్కు పంపిస్తామని దుర్భాషలాడినట్లు నజీర్ వెల్లడించాడు. అంతేకాదు తన మొబైల్ ఫోన్ లాక్కొని తన బైకును ధ్వంసం చేసి అక్కడి నుంచి పారిపోయారని నజీర్ తెలిపాడు. వారి బైకు నెంబరు నోట్ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. పోలీసులు వారిని గుర్తించి పట్టుకున్నారు. నజీర్కు నిందితులు, వారి తల్లిదండ్రులు క్షమాపణ చెప్పారు. క్షమాపణ కోరడంతో కేసును విత్డ్రా చేసుకున్నట్లు నజీర్ స్పష్టం చేశారు.