తెలుగు విద్యార్థులకు తాకిన కశ్మీర్ సెగ.. ! అందర్నీ సేఫ్గా తీసుకొస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్
Recommended Video
హైదరాబాద్ : కశ్మీర్లో భద్రతా బలగాల మొహరింపుపై హై టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో శ్రీనగర్లోని ఎన్ఐటీ క్యాంపస్ నుంచి విద్యార్థులు ఇంటికెళ్లిపోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో విద్యార్థులు తమ స్వస్థలాలకు బయల్దేరారు. దీనిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. విద్యార్థులు తిరిగి వచ్చేందుకు సహాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కేటీఆర్ ట్వీట్
కశ్మీర్లో పరిస్థితి బాగోలేదు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు చేస్తారనే హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే సీఆర్పీఎఫ్ బలగాలు మొహరించాయి. మరోవైపు ప్రజలు కూడా నిత్యవసరాల సరుకులు, నగదు కోసం ఏటీఏం, సరుకుల కోసం మార్కెట్ల వద్ద క్యూ కట్టారు. దీంతో శ్రీనగర్ ఎన్ఐటీ నుంచి విద్యార్థులు కూడా తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. కశ్మీర్ పరిస్థితిపై ఇప్పుడే వార్తల్లో చూశానని కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యార్థులు క్షేమంగా ఇంటికి తిరిగిరావాలని కోరారు. ఇప్పటికే అధికారులను అటాచ్ చేశామని అందులో పేర్కొన్నారు. అంతేకాదు విద్యార్థి/ పేరెంట్ సాయం కోసం రెసిడెంట్ కమిషనర్ వేదాంతంను సంప్రదించాలని కోరారు. ఈ మేరకు 011-2338 2041, +91 99682 99337 మొబైల్ నంబర్ను కూడా షేర్ చేశారు.
ఇదీ విషయం
స్వాతంత్ర్య దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు తెగబడుతారనే సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కశ్మీర్లో ఉగ్రవాదులు దాడులు చేస్తారనే సమాచారంతో అలర్టయ్యారు. ఇప్పటికే అమర్ నాథ్ యాత్రికులను తిరిగివెళ్లిపోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కశ్మీర్లో సీఆర్పీఎప్ బలగాలను భారీగా మొహరిస్తున్నారు. మరోవైపు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో నేతలంతా గవర్నర్ సత్యపాల్ మాలిక్ను కలువడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో గవర్నర్ స్పందిస్తూ .. శత్రుదేశ చర్యల వల్లే బలగాలను మొహరిస్తున్నామని .. భయపడాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.
వెనక్కి రండి ..
కానీ ఇప్పటికే వెనక్కి వెళ్లిన సీఆర్పీఎఫ్ బెటాలియన్లు తిరిగి కశ్మీర్ రావాలని ఆదేశాలు జారీచేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కశ్మీర్ వ్యాలీలో కొన్ని బెటాలియన్లు ఉన్నాయని .. అయితే పరిస్థితి సద్దుమణిగిందని కొన్ని వెళ్లిపోయాయి. దీంతో వాటిని మళ్లీ రీ కాల్ చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ముఖ్యంగా అమర్ నాథ్ యాత్రికులు లక్ష్యంగా దాడులకు తెగబడతారనే సమాచారంతో .. అప్రమత్తమయ్యారు. యాత్రికుల భద్రత దృష్ట్యా వారిని వెనక్కి పంపిస్తున్నామని తెలిపారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని వెనక్కి పంపిస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కశ్మీర్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.
పుకార్లను నమ్మొద్దు
కశ్మీర్లో పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన వివరించారు. శత్రుదేశం చర్యలకు ధీటుగా మాత్రమే స్పందిస్తున్నామని వెల్లడించారు. దీంతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. మరోవైపు కశ్మీర్ కొండల్లో ఉన్న ప్రజలు మాత్రం బిక్కు బిక్కుమంటున్నారు. పరిస్థితి బట్టి కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులు పెట్రోల్ను కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు మార్కెట్లలో నిత్యవసరాల సరుకులు ఎక్కువే కొనుగోలు చేస్తున్నారు. ఏటీఎం సెంటర్ల నుంచి నగదు విత్ డ్రా చేస్తున్నారు. దీంతో పెట్రోలు బంకులు, సూపర్ మార్కెట్లు, ఏటీఏం సెంటర్ల వద్ద రద్దీ నెలకొంది. సరుకులు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు బారులుతీరారు.