నో టెన్షన్, మేమే గెలుస్తామన్న కుమారస్వామి, యడ్డీపై ఏసీబీకి ఫిర్యాదు!
Recommended Video
బెంగళూరు: విశ్వాస పరీక్ష నేపథ్యంలో తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, బల పరీక్షలో కచ్చితంగా తాము నెగ్గి తీరుతామని కర్ణాటక సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు. పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నందునా అంతిమ విజయం తమదేనని చెప్పారు.
సంఖ్యా బలం లేకున్నా బీజేపీ అధికారం కోరుకుందని, అంతిమంగా వారికి పరాభవం తప్పలేదని అన్నారు. శుక్రవారం జరిగే బలపరీక్షలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి నెగ్గుతుందని, తద్వారా కర్ణాటకలో ప్రజాస్వామ్య విరుద్దంగా జరుగుతున్న పరిణామాలకు చెక్ పెట్టినట్టవుతుందని వెల్లడించారు.
కాగా, నేటి మధ్యాహ్నాం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ల ఎంపిక అనంతరం.. అసెంబ్లీలో బలనిరూపణ జరగనుంది. విశ్వాస పరీక్షకు 111 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా, కాంగ్రెస్ జేడీఎస్ కూటమికి 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో కుమారస్వామి బలపరీక్షలో నెగ్గడం లాంఛనమే అంటున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రిసార్టులోనే ఉండగా.. జేడీఎస్ ఎమ్మెల్యేలు ఓ హోటల్లో ఉన్నారు. అక్కడినుంచి వారు నేరుగా అసెంబ్లీకి రానున్నారు.
యడ్యూరప్ప ఏసీబీకి ఫిర్యాదు:
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కర్ణాటక బీజేపీ శాసనసభాపక్ష నేత యడ్యూరప్ప ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ గురువారం ఏసీబీకి ఫిర్యాదు చేసింది. యడ్యూరప్పతో పాటు ఆయన తనయుడు విజయేంద్ర, బీజేపీ కర్ణాటక ఇంచార్జ్ మురళీధర్ రావు, గాలి జనార్ధన్ రెడ్డి, బీ శ్రీరాములు, బీజే పుట్టస్వాములకు ఇందులో ప్రమేయం ఉందన్నారు.
కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు లంచం ఇచ్చేందుకు వారు ప్రయత్నించారని కాంగ్రెస్ తన ఫిర్యాదులో పేర్కొంది. బేరసారాలకు సంబంధించిన ఆడియో టేపులను సైతం ఏసీబీకి సమర్పించింది. యడ్యూరప్ప బలనిరూపణ సందర్భంలో ఈ ప్రలోభాల పర్వం నడించిందని ఏసీబీకి తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసినప్పటికీ.. ఏసీబీ మాత్రం ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు.