సహజమే: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఓటమిపై సోనియా గాంధీ
న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ గెలుపుపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ప్రతిపక్షాల తరఫున కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్ నిలబడ్డారు. ఆయన 20 ఓఠ్ల తేడాతో ఓడిపోయారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. గెలుపోటములు సహజమే అన్నారు.
కొన్నిసార్లు గెలుస్తామని, ఇంకొన్ని సార్లు ఓడిపోతామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆమె అలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. హరివంశ్ గెలవడంతో మరోసారి ప్రతిపక్షాలు ఐకమత్యంతో తమ అభ్యర్థిని గెలిపించుకోవడంలో విఫలమయ్యాయి.
రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిదే గెలుపు: కాంగ్రెస్కు టీడీపీ, ఎన్డీయేకు టీఆర్ఎస్ ఓటు
2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఏకమై బీజేపీని ఓడించాలని భావించాయి. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి దాదాపు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీదే. ఒక్కసారి మాత్రం ఇతర పార్టీలకు వెళ్లింది. బీజేపీకి ధీటుగా విపక్షంలోని మిత్రపక్షాల అభ్యర్థిని నిలబెడదామని భావించింది. ముగ్గురిని పరిశీలించింది. చివరకు కాంగ్రెస్ నుంచి హరిప్రసాద్ బరిలో నిలిచారు.
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వకపోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మోడీని ఆలింగనం చేసుకోగలిగే రాహుల్ గాంధీ, తమ మద్దతు కోరుతూ కనీసం ఒక ఫోన్ కూడా చేయలేరా అని ప్రశ్నించింది.