ఎంతమంది ఒవైసీలు వచ్చినా.. సీఏఏను వెనక్కి తీసుకోం:ఢిల్లీ ఆందోళనలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. మైనార్టీలను ఒవైసీ రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టంతో మైనార్టీలకు నష్టం జరగదని స్పష్టంచేశారు. కానీ ఒవైసీ మాత్రం కావాలనే రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు. ఎంతమంది ఒవైసీలు వచ్చినా.. సీఏఏను వెనక్కి తీసుకోబోమని స్పష్టంచేశారు. ఈశాన్య ఢిల్లీలో జరుగుతోన్న ఆందోళనలపై హైదరాబాద్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Recommended Video
ఈశాన్య ఢిల్లీలో హింసను పథకం ప్రకారం ప్రోత్సహిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం చెప్పే అంశాలను నమ్మొద్దని పేర్కొన్నారు. తప్పుడు మాటలను మైనారిటీ సోదరులు పట్టించుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పౌరసత్వ సవరణ చట్టంతో పౌరులకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టంచేశారు. కానీ కొందరు కావాలనే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి కామెంట్ చేశారు.
ఢిల్లీలో ఎందుకు విధ్వంసం చేస్తున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను నష్టం కలిగిస్తే వచ్చే ప్రయోజనం ఏంటి అని అడిగారు. పౌరుల ఇళ్లు, పెట్రోల్ బంక్ అని కూడా చూడకుండా విధ్వంసం చేయడం సరికాదన్నారు. ఏ వర్గం హింసను ప్రేరేపించినా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఆందోళన చేసినా.. ఒక్కరినీ కూడా వదిలిపెట్టబోదని తేల్చిచెప్పారు.
జాఫ్రాబాద్, బాబర్పుర్, గోకుల్పురి, మౌజ్పూర్, బ్రహ్మ్పుర, చాంద్బాగ్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనలో మృతిచెందిన వారి సంఖ్య ఏడుకి చేరింది. దీంతో కేంద్రహోంమంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లెప్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పార్టీలకు చెందిన నేతలు, ఢిల్లీ పోలీసు కమిషనర్, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.