రియల్ హీరో-వెల్కం బ్యాక్: కీలక స్థావరాలను టార్గెట్ చేసిన పాక్, అభినందన్ ఎలా సాహసం చేశారంటే?
న్యూఢిల్లీ: మంచి యుద్ధ విమాన పైలట్ కావడానికి ఎలా ఉండాలి? 'బ్యాడ్ యాట్యిట్యూట్' వింగ్ కమాండర్ అభిరామ్ వర్ధమాన్ ఓ టెలివిజన్ డాక్యుమెంటరీలో నవ్వుతూ చెప్పిన మాట ఇది. పుల్వామా దాడి అనంతరం, భారత్ పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ మన మిలిటరీ బేస్ను టార్గెట్ చేసుకుంది. పాకిస్తాన్ మన కీలక మిలిటరీ బేస్ను టార్గెట్ చేసుకోగా, దానిని నివారించేందుకు అభినందన్ చూపిన తెగువ, ధైర్యసాహసాల పట్ల యావత్ భారతం అతని పట్ల ప్రేమ చూపుతోంది. అతని పట్ల కృతజ్ఞతతో ఉంది.
పాకిస్తాన్ విమానాలను చేజ్ చేసిన అభినందన్
పాక్.. భారత్ను టార్గెట్ చేసుకుంది. పాకిస్తాన్ మనల్ని టార్గెట్ చేయగా, అభినందన్ ప్రతిస్పందించి, పాకిస్తాన్కు చెందిన ఎఫ్16 విమానాన్ని చేజ్ చేశాడు. దీంతో అతను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోకి వెళ్లారు. అప్పటికే సరిహద్దుల్లో హైఅలర్ట్ ఉంది. నియంత్రణ రేఖను దాటి 24 పాక్ యుద్ధ విమానాలు వచ్చాయి. మన దేశంలోకి చొరబడ్డాయి. ఉదయం గం.9.45 తర్వాత ఎఫ్ 16లు, నాలుగు మిరాజ్ 3, నాలుగు జేఎఫ్ 17 విమానాలు సమూహంగా భారత్లోకి చొచ్చుకు వచ్చాయి. వీటికి రక్షణంగా కొన్ని విమానాలు నియంత్రణ రేఖ అవతలివైపు సిద్ధంగా ఉన్నాయి.
నియంత్రణ రేఖ దాటిన పాకిస్తాన్ విమానాలను భారత వాయుసేనకు చెందిన ఎనిమిది విమానాలు అడ్డుకొన్నాయి. వీటిల్లో నాలుగు సుఖోయ్ 30లు, రెండు మిరాజ్ 2000, రెండు మిగ్ 21 బైసన్లు ఉన్నాయి. మిగ్ 21లలో ఒక దానిని వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ నడిపారు. అతడు ఒక ఎఫ్ 16పైకి ఆర్ 73 క్షిపణిని ప్రయోగించారు. మరోవైపు నుంచి పాక్ ఎఫ్16 కూడా రెండు ఏఎంఆర్ఏఏఎం క్షిపణులను ప్రయోగించింది. వీటిల్లో ఒకటి అభినందన్ విమానాన్ని తాకింది. ఈ క్రమంలో అభినందన్ విమానం పీవోకేలో కూలిపోయింది. ప్యారాచూట్ ద్వారా అతను నియంత్రణ రేఖకు అవతల నేలపై దిగారు. అతనిని పాక్ ఆధీనంలోకి తీసుకుంది.
బుధవారం ఉదయం పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత్లోకి చొచ్చుకు రావడాన్ని రాడార్లు పసిగట్టాయి. పది గంటలకు మూడు ఎఫ్16 విమానాలు భారత్ గగనతలంలోకి వచ్చాయి. ఈ విమానాలు నౌషెరా ప్రాంతంలో బాంబులు జారవిడిచాయి. వెంటనే రంగంలోకి దిగిన ఐఎఫ్ తిప్పికొట్టింది.
పాక్ యుద్ధ విమానాలను ఎదుర్కొనేందుకు, ఆ వెంటనే వింగ్ కమాండర్ అభినందన్ 'మేం సిద్ధంగా ఉన్నాం, సర్' అని తెలిపారు. వెంటనే అతను మిగ్ 21 బైసన్స్ విమానం తీసుకున్నారు. అభినందన్ పాతకాలపు మిగ్ బైసన్ విమానంలో వెళ్లారు. దీంతో ఆపరేషన్ అంత సులువైన పనేమీ కాదు. ఎఫ్ 16లతో పోలిస్తే మిగ్ బైసన్ పాతవి.
అసలు పాకిస్తాన్ టార్గెట్ ఇండియన్ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్, ఆర్మీ ఇన్స్టాలేషన్స్. పసిగట్టిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దానిని ఎదుర్కొనేందుకు జెట్ విమానాలను రంగంలోకి దింపాయి. శ్రీనగర్ నుంచి రెండు మిగ్ 21 విమానాలు, అలాగే సుఖోయ్ 30ఎంకేఐ విమానాలను పంపించాయి. ఇందులో ఓ మిగ్ 21లో అభినందన్ ప్రయాణించి... పాక్కు చెందిన ఎఫ్16డీలను వెంబడించారు.
వింగ్ కమాండర్ అభినందన్ వీరోచిత పోరాటం చేశారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూడా తమ ఎఫ్ 16ల రక్షణ కోసం నాలుగు మిరాగ్ 3 ఎయిర్ క్రాఫ్ట్స్, నాలుగు చైనీస్ మేడ్ జేఎప్ 17 థండర్ ఫైటర్స్ను ఉంచింది. ఈ నేపథ్యంలో అభినందన్ ఎంతో రిస్క్ చేశారు.
పాక్ యుద్ధ విమానాలను చేజ్ చేసి
కానీ అభినందన్ దేశభక్తి ఆ రిస్క్కు సిద్ధపడింది. పాక్ విమానాలను వెంబడించారు. అతను తన వేటను కొనసాగించి, పాకిస్తాన్ ఎఫ్ 16ని రాడార్ ద్వారా లాక్ చేశారు. అతను గాలిలో పేల్చగల ఆర్-73 మిసైల్ను ప్రయోగించారు. అప్పటికే అతను పాక్ ఎఫ్ 16ను పేల్చేశారు. ఈ సమయంలో అభినందన్ అనుకోకుండా పాకిస్తాన్ వైపు వెళ్లిపోయారు. దీంతో అతను వారికి పట్టుబడ్డారు.
ఇండియన్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ను పాకిస్తాన్ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ వింగ్ కమాండర్ అభినందన్ వీరోచిత పోరాటం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కారణంగా.. పాకిస్తాన్ టార్గెట్లు మిస్ అయ్యాయి. ఏ లక్ష్యాన్ని కూడా పాకిస్తాన్ ఛేదించలేకపోయింది. పాకిస్తాన్ స్వాధీనంలో ఉన్నప్పటికీ అభినందన్ గుండెధైర్యం యావత్ భారతాన్ని గర్వించేలా చేసింది. పాకిస్తానీయులు తనను తమ ఆధీనంలోకి తీసుకునే ముందు అతని తీరు అందరినీ అబ్బురపరిచింది. భారత్కు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకూడదని ఆయన నిర్ణయించుకున్నారు.
పాక్ భూభాగంలో ఉన్నానని తెలియగానే
అందుకే, తాను పాకిస్తాన్ భూభాగంలో ఉన్నానని తెలియగానే అభినందన్ గాల్లోకి కాల్పులు జరిపారు.. వారితో పోరాడే ప్రయత్నాలు చేశారు.. శత్రువు చేతుల్లోకి భారత్కు సంబంధించిన ఏ పత్రాలు వెళ్లకుండా ఉండేందుకు వాటిని మింగేశారు. ఆ తర్వాతే పాక్ చేతికి పట్టుబడ్డారు.
ఈ సంఘటన తర్వాత అతనికి తీవ్ర రక్తస్రావం అయినట్లుగా కనిపించింది. పాకిస్తాన్లోని స్థానికులు అతనిని పట్టుకున్నారు. అతనిపై దాడి చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అతను గాలిలోకి మాత్రమే కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడి చెరువులో దూకారు. తనవద్దనున్న కీలకమైన డాక్యుమెంట్లు, మ్యాప్స్ తీసి మింగేశాడు. ఆ తర్వాత మరికొన్ని పత్రాలను నీటిలో తడిపారు. తద్వారా శత్రువుకు ఏదీ దొరకకుండా చేసే ప్రయత్నాలు చేశారు.
అభినందన్ చెన్నైకి చెందినవారు. అతనికి యుద్ధ విమానం నడపడంలో పదహారేళ్ల అనుభవం ఉంది. మాజీ ఫైటర్ పైలట్, ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్ధమాన్ తనయుడు.. ఈ అభినందన్. అభినందన్ 2000లో నేషనల్ డిఫెన్స్ అకాడమిలో జాయిన్ అయ్యారు. 2004లో అతనికి ఫైటర్ పైలట్ బాధ్యతలు అప్పగించారు. మిగ్ 21ఎస్ పైలట్గా ఉండటానికి ముందు అతను సు30ఎంకేఐ పైలట్గా ఉన్నారు. అభినందన్ కోయంబత్తూరులోని అమరావతినగర్ సైనిక్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వవిద్యార్థి. ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అభినందన్ ఎవరంటే?
తన తండ్రిని అభినందన్ స్ఫూర్తిగా తీసుకున్నారు. తండ్రి 1973లో ఫైటర్ పైలట్ బాధ్యతలు చేపట్టారు. అతని కెరీర్లో 4000 గంటల పాటు నడిపిన ఘనత అతని సొంతం. 2001లో పార్లమెంటుపై దాడుల అనంతరం అభినందన్ తండ్రికి ఆపరేషన్ పరాక్రమ సందర్భంగా వెస్టర్న్ సెక్టార్ బాధ్యతలు అప్పగించారు.
అభినందన్ తల్లి డాక్టర్. ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల్లో సందర్శించి వైద్య సేవలు అందించారు. అభినందన్ సతీమణి తన్వీ మార్వా కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పని చేశారు. ఆమె ధైర్యానికి పలుమార్లు గౌరవ పురస్కారాలు దక్కాయి.
అభినందన్ 2011లో ఓ టెలివిజన్ డాక్యుమెంటరీలో కనిపించారు. ఎస్యూ30 పైలట్గా మారడానికి కారణం ఏమిటని ఈ డాక్యుమెంటరీలో అడుగుతారు. దానికి అభినందన్ నవ్వుతూ సమాధానం చెబుతూ... మేం పొందిన శిక్షణ కారణంగానే పైలట్గా మారడానికి కారణమైందని చెప్పారు.
ఇతని సన్నిహితులు, సహోద్యోగులు అతనిని సింగం (సింహం)గా అభివర్ణించారు. 'వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ వెల్కం బ్యాక్, మీరు ఇండియన్ రియల్ హీరో' అని యావత్ భారతావని ప్రశంసిస్తోంది.