మాతృభూమిలో అడుగుపెట్టిన అభినందన్: మోడీ, నిర్మలా, రాహుల్ గాంధీ ప్రశంసలు
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ను పాకిస్తాన్ను వాఘా సరిహద్దు వద్ద వదిలివేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్లు చేశారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. వాఘా సరిహద్దు వద్ద అభినందన్ను భారత్కు పాక్ అప్పగించింది. లాహోర్ నుంచి రోడ్డు మార్గంలో అభినందన్ను పాకిస్తాన్ అధికారులు తీసుకువచ్చారు. వాఘా సరిహద్దు ఇరు దేశాల అధికారులు అప్పగింత పత్రాలు మార్చుకున్న అనంతరం అభినందన్ను భారత్ అధికారులకు అప్పగించారు.
సరిహద్దు వద్ద అభినందన్కు భారత వాయుసేన ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అభినందన్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వైమానిక దళ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్ తెలిపారు. తొలుత సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో అభినందన్ను భారత అధికారులకు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇమిగ్రేషన్ పక్రియ కారణంగా అప్పగింత ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో వారు ట్వీట్లు చేశారు.
ప్రధాని మోడీ
'వింగ్ కమాండర్ అభినందన్కు మాతృదేశానికి స్వాగతం, మీ అసమాన ధైర్యసాహసాలు చూసి దేశం గర్విస్తోంది, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ 130 కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి, వందేమాతరం' అని మోడీ ట్వీట్ చేశారు.
నిర్మలా సీతారామన్
వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను చూసి గర్విస్తున్నామని, నీ అసమాన ధైర్యసాహసాలు చూసి భారత్ మొత్తం హర్షిస్తోందని, యువతకు మీరు స్ఫూర్తి అని, సెల్యూట్... వందేమాతరం అని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ
వింగ్ కమాండర్ అభినందన్.. మీ ధైర్యం, సమయస్ఫూర్తిని చూసి మేం ఎంతో గర్విస్తున్నామని, మీకు స్వాగతం పలుకుతున్నామని, మరింత ప్రేమతో స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.