‘వెల్డన్’: సిరాదాడి కార్యకర్తలను మెచ్చుకున్న ఉద్ధవ్
ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే సోమవారం అరెస్టై బెయిల్పై విడుదలైన తన పార్టీ కార్యకర్తలను మంగళవారం కలిశారు. అనంతరం వారు చేసిన పనిని భినందించారు. పాక్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖుర్షిద్ మహ్మద్ కసూరి రాసిన 'నెయిదర్ ఎ హాక్ నార్ ఎ డవ్' పుస్తకావిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం ముంబైలో నిర్వహించారు.
కాగా, ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని శివసేన పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ కార్యక్రమ నిర్వాహకుడు సుధీంద్ర కులకర్ణి ముఖంపై నలుపు రంగు పోసి హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనకు పాల్పడిన శివసేన కార్యకర్తలు ఆరుగురిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం వారు బెయిలుపై బయటకు రాగానే వారిని ఉద్ధవ్ థాక్రే కలిశారు. మంచి పని చేశారంటూ వారిని ప్రశంసించారు.
అమరులను కించపర్చారు: ఫడ్నివీస్పై సంజయ్ రౌత్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రను అర్థం చేసుకోలేకపోయారని శివసేన ఎంపీ సంజయ్రౌత్ అన్నారు. పాకిస్థాన్ మాజీ మంత్రి ఖుర్షిద్ మహ్మద్ కసూరి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం పట్ల శివసేన నిరసన నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడణవీస్ గట్టి భద్రత కల్పించారు.
కాగా, దీనిపై సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ మంత్రికి మద్దతుగా నిలిచి ముంబై పేలుళ్లలో మృతిచెందిన అమరులను ఫడ్నవీస్ కించపరిచారని ఆయన అన్నారు. కసూరికి మద్దతు ఇవ్వడం ద్వారా మనకు ఫడ్నవీస్ చెడ్డపేరు తెచ్చారని అన్నారు.