ఎన్నో అవమానాలు: తన క్షోభను బయటపెట్టిన అమితాబ్ బచ్చన్
ఈ వయస్సులో తనకు ప్రశాంతత కావాలని, నా జీవితంలో మిగిలి ఉన్న ఈ కొన్నేళ్లు తనతోనే గడపాలనుకుంటున్నానని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: ఈ వయస్సులో తనకు ప్రశాంతత కావాలని, నా జీవితంలో మిగిలి ఉన్న ఈ కొన్నేళ్లు తనతోనే గడపాలనుకుంటున్నానని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపిన పనామా పేపర్స్, బోఫోర్స్ కుంభకోణంలో అమితాబ్ బచ్చన్ పేరు వినిపించింది. తాజాగా పారడైజ్ పత్రాల జాబితాలోను ఆయనకు అక్రమ లావాదేవీలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
బ్లాగ్లో అమితాబ్ బచ్చన్ వివరణ
ఈ నేపథ్యంలో ఆయన తన బ్లాగ్లో వివరణ ఇచ్చారు. ఈ వయస్సులో తనకు ప్రశాంతత కావాలని, తన జీవితంలో మిగిలి ఉన్న ఈ కొన్నేళ్లు నాతోనే గడపాలనుకుంటున్నానని, తన పేరు హెడ్లైన్స్లో వచ్చినా పట్టించుకోనని అమితాబ్ అన్నారు.
ఒక్కోసారి వివరణ ఇవ్వాలనిపిస్తుంది
ఇప్పటి వరకు అక్రమ కట్టడాలు, ఆస్తుల విషయాల్లో తనకు నోటీసులు అందాయని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఒక్కోసారి వీటిపై వివరణ ఇవ్వాలనిపిస్తుందని అమితాబ్ పేర్కొన్నారు.
మరోసారి స్పందించకుంటే గొడవ ఉండదనిపిస్తుంది
ఇంకోసారి, అసలు ఇలాంటి వాటి పైన స్పందించకుంటే ఎలాంటి గొడవ ఉండదనిపిస్తుందని అమితాబ్ అన్నారు. కొన్నేళ్లుగా స్కాంలలో ఇరుక్కున్నామంటూ తన గురించి తన కుటుంబం గురించి వస్తున్న వార్తలు చూసి చాలా బాధపడ్డామన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు.
మా క్షోభ మాయమవుతుందా
ఓసారి ఈ విషయం గురించి మీడియా వర్గాలు నన్ను ప్రశ్నిస్తూ.. దీని గురించి మీరేం చేయబోతున్నారని అడిగారని, తానేం చేసినా కొన్నేళ్ల పాటు మేం అనుభవించిన క్షోభ మాయమైపోతుందా? కాబట్టి ఈ విషయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదని చెప్పానని అమితాబ్ అన్నారు.
నా రెండు సమాధానాలు ఇవే
విచారణలో భాగంగా తమ సమాధానాలు అడుగుతున్నారని, ఇప్పటి వరకు రెండు సమాధానాలు ఇచ్చామని, ఒకటి మా పేర్లను వాడుకుంటున్నారని, మరొకటి మేం ఇలాంటి కేసుల్లో నిందితులుగా లేమని అన్నారు. ఈ సమాధానాలు పత్రికల్లో కూడా ప్రచురితమయ్యాయని చెప్పారు. అయినా ప్రశ్నల వర్షం ఆగడం లేదన్నారు. బాధ్యతగల పౌరులుగా ఈ విషయంలో మేము అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు.