ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి వెళ్లారా? లేక చెట్లను పీకడానికి వెళ్లారా?: నవజ్యోత్ సింగ్ సిద్ధు
చండీగఢ్: కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధు.. కేంద్రంపై విరుచుకుపడ్దారు. పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ సమీపంలో జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థ శిక్షణా శిబిరంపై భారత వైమానిక దళం చేసిన దాడులను ఆయన ప్రశ్నించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వైమానిక దాడులు పూర్తిగా ఎన్నికల జిమ్మిక్కు అని విమర్శించారు. నిజంగా దాడులు చేసి ఉంటే సాక్ష్యాధారాలను బహిర్గతం చేయడానికి వచ్చిన ఇబ్బందేమిటని నిలదీశారు.
బాలాకోట్ పై వైమానిక దాడుల సాక్ష్యాలను వెల్లడించాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్, కపిల్ సిబల్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్.. వంటి నేతలు ఇప్పటికే బాహటంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని తూర్పారబట్టుతున్నారు. తాజాగా సిద్ధు కూడా వారితో గళం కలిపారు. కఠిన పదాలతో ఆయన విమర్శిస్తూ, సోమవారం ట్వీట్లను వదిలారు. ఈ దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు హతమైతే .. ఒక్క ఫొటో కూడా ఎందుకు బహిరంగ చేయలేదని ప్రశ్నించారు.
బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం చేసిన దాడుల్లో 300 మంది హతమయ్యారని అంటున్నారు. నిజమా? కాదా? సూటిగా సమాధానం ఇవ్వాలని సిద్ధూ డిమాండ్ చేశారు. సమాధానం ఇవ్వకపోతే.. ఆ వైమానిక దాడుల ఉద్దేశమేంటని నిలదీశారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి వెళ్లారా? లేక అక్కడి చెట్లను పీకడానికి వెళ్లారా? అని ప్రశ్నించారు. ఇదంతా ఎన్నికల జిమ్మిక్ అని ఎద్దేవా చేశారు.
దేశ సైన్యాన్ని అడ్డుగా పెట్టుకుని రాజకీయం చేయాలనుకోవడం సరికాదని అన్నారు. జవాన్ల బలిదానాలపై రాజకీయాలు మానుకోవాలని సూచించారు. అక్కడితో ఆగలేదాయన. దాడుల తరువాత బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యాలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి 22 స్థానాల్లో విజయం సాధించడానికి ఈ దాడులు ఉపయోగపడతాయంటూ యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలను సిద్ధూ ఉటంకించారు. అసోం మంత్రి హిమంత్ బిశ్వ శర్మ, ఎస్ఎస్ అహ్లువాలియా చేసిన కామెంట్లకు సంబంధించిన క్లిప్పింగులను సిద్ధూ తన ట్వీట్ జత చేశారు. వాటన్నింటినీ క్రోడీకరించి చూస్తే.. వైమానిక దాడులు బీజేపీ జిమిక్కు అని అభివర్ణించారు.