ఆర్ఎస్ఎస్ కార్యకర్త కుటుంబం దారుణహత్య: గర్భంతో ఉన్న భార్య, ఎనిమిదేళ్ల కుమారుడి సహా!
ముర్షీదాబాద్:పశ్చిమ బెంగాల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సానుభూతిపరుడిగా పేరున్న ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడి కుటుంబం దారుణ హత్యకు గురైంది. ఉపాధ్యాయుడు, ఆయన భార్య, కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హతమార్చారు. ఉపాధ్యాయుడు, ఆయన కుటుంబం హత్యకు గురైందనే విషయం రెండు రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
ఆ ఉపాధ్యాయుడి పేరు బొంధు గోపాల్ పాల్. భార్య బ్యూటీ, కుమారుడు అగన్ లతో కలిసి ముర్షీదాబాద్ జిల్లా జియాగంజ్ లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. గోపాల్ భార్య ఆరు నెలల గర్భిణి. ఆర్ఎస్ఎస్ సానుభూతిపరుడిగా ఆయనకు స్థానికంగా పేరుంది. ఆర్ఎస్ఎస్ శిక్షణా తరగతులకు ఆయన హాజరవుతుంటారు. రెండు రోజులుగా ఆయన గానీ, ఆయన కుటుంబీకులు గానీ ఎవరికీ కనిపించలేదు. మంగళవారం విజయదశమి నాడు కూడా గోపాల్, ఆయన కుటుంబం దుర్గా పూజకు హాజరు కాలేదు. బుధవారం ఉదయం కూడా వారి జాడ కనిపించలేదు. గోపాల్ సెల్ కు ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చినట్లు కుటుంబీకులు, స్థానికులు తెలిపారు.
దీనితో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గోపాల్ ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా.. ముగ్గురి మృతదేహాలు రక్తపు మడుగులో కనిపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ముర్షీదాబాద్ జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సోమవారం రాత్రే వారు హత్యకు గురై ఉంటారని అనుమానించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ముర్షీదాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోపాల్ కుటుంబం హత్యోదంతంపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, స్థానిక బీజేపీ నాయకులు నిరసన ప్రదర్శనలకు దిగారు.
గర్భంతో ఉన్న గోపాల్ భార్యను, ఎనిమిదేళ్ల కుమారుడిని హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. భారతీయ జనతాపార్టీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు పశ్చిమ బెంగాల్ లో భద్రత లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిని ఆయన ఇంట్లో చొరబడి దారుణంగా హత్య చేస్తే..ఆ సమాచారం పోలీసులకు తెలియడానికి రెండురోజుల పట్టిందని, ఇక హంతకులను ఎప్పుడు పట్టుకుంటారని నిలదీస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, హిందూ సమాజంపై దాడులు కొనసాగుతున్నప్పటికీ పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారు.