ABP C-Voter Opinion Poll: వెస్ట్ బెంగాల్..బెస్ట్ సీఎం అభ్యర్థి ఎవరు?: బీజేపీకి ఎంతమంది జై?
కోల్కత: దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఒపీనియన్ పోల్స్ కోలాహలం నెలకొంది. తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలను నిర్వహించబోతోన్నందున.. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల వేడి పీక్స్కు చేరుకుంది. అన్ని పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలు దక్షిణాది రాష్ట్రాలకు బారులు తీరుతున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇక్కడ పర్యటించారు. తాజాగా- ఈ ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. పుదుచ్చేరి, తమిళనాడుల్లో ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొనబోతోన్నారు.
ఒపీనియన్ పోల్స్ సందడి..
నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజే ఒపీనియన్ పోల్స్ వెలువడ్డాయి. జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్స్.. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతోన్నాయనే విషయాన్ని కాస్త టేస్ట్ చేయించాయి. ప్రభుత్వాలు, ఎన్నికల బరిలో నిల్చొన్న పార్టీల పనితీరు. ముఖ్యమంత్రి అభ్యర్థి వంటి కొన్ని కీలక అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ఈ ఒపీనియన్ పోల్స్ సాగింది. ఓటరు నాడి ఎలా ఉందనే విషయాన్ని తేటతెల్లం చేశాయి.
సగానికి పైగా ఓటర్లు దీదీ వైపే..
పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని ఏబీపీ, సీ ఓటర్ ఒపీనియన్ పోల్ తేల్చేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా మమతా బెనర్జీ వైపే.. బెంగాళీయులు మొగ్గు చూపారు. ఏకంగా 54.5 శాతం మంది ప్రజలు మమత బెనర్జీని ముఖ్యమంత్రిగా మరోసారి చూడాలనుకుంటున్నారు. మళ్లీ ఆమె ప్రభుత్వ పగ్గాలను అందుకోవాలని ఆశిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే ఓటర్ల నాడి ఇదే. మమత బెనర్జీనే వారు ముఖ్యమంత్రిగా కోరుకుంటోన్నారు. ఇందులో మహిళా ఓటర్ల శాతం అధికంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
బీజేపీకి 24 శాతం మందే..
పశ్చిమ బెంగాల్లో పాగా వేయడానికి భారతీయ జనతా పార్టీ చేస్తోన్న ప్రయత్నాలు పెద్దగా ఫలించేలా కనిపించట్లేదని ఈ ఒపీనియన్ పోల్ స్పష్టం చేసింది. బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరిస్తే బాగుంటుందనేది ఓటర్ల శాతం 24.6 శాతమే. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించనప్పటికీ.. ఆ పార్టీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ వైపు ఓటర్లు మొగ్గు చూపారు. ఆయనను ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా 24.6 శాతం మంది కోరుకుంటున్నారు. బీజేపీకే చెందిన ముకుల్ రాయ్-8.5, కాంగ్రెస్ లోక్సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌధరి-2.2, సీపీఎం నేత సుజోన్ చక్రబొర్తి-3.2 శాతం మంది ఈ ఒపీనియన్ పోల్లో ఓటు వేశారు.
పినరయికే ఫిక్స్..
కేరళలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ సీనియర్ నేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్నే మలయాళీలు మళ్లీ కోరుకుంటున్నారు. అత్యుత్తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పినరయిని సమర్థించే వారి శాతం 38.5గా నమోదైంది. ఈ సారి కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని మెజారిటీ ప్రజలు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి 27 శాతం మంది ఓటు వేశారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో బాగా వినిపించిన పేరు.. ఆరోగ్యశాఖ మంత్రి టీచర్ కేకే శైలజ. ఆమెను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని 6.9 శాతం మంది కోరుకుంటున్నారు. కాంగ్రెస్కే చెందిన మరో సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకునే వారి శాతం 5.2.