బీజేపీ నేత నిప్పుతో చెలగాటం: ఫైర్ బ్రాండ్తో బిగ్ ఫైట్: నందిగ్రామ్ ఫిక్స్: 12న నామినేషన్
కోల్కత: భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ నాయకుడు, మాజీ మంత్రి సువేందు అధికారి.. రాజకీయాల్లో చావో, రేవో తేల్చుకోవడానికి సిద్ధపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఏకంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఢీ కొట్టబోతోన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముంగింట్లో పార్టీ ఫిరాయించిన ఈ తృణమూల్ మాజీ నాయకుడు తనకు అచ్చి వచ్చిన నందిగ్రామ్ నుంచే బరిలో దిగనున్నారు. బీజేపీ అభ్యర్థిగా నందిగ్రామ్ నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నెల 12వ తేదీన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.
ఇదివరకు సుదీర్ఘకాలం పాటు తృణమూల్ కాంగ్రెస్లో కొనసాగిన సువేందు అధికారి.. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్న విషయం తెలిసిందే. మమతా బెనర్జీ కేబినెట్లో రవాణాశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీలో చేరారు. 2016 నాటి ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థిగా ఆయన నందిగ్రామ్ నుంచే పోటీ చేశారు. ఇప్పుడూ అదే స్థానం నుంచి పోటీకి దిగనున్నారు. చివరి నిమిషంలో వెన్నుపోటు పొడిచిన సువేందు అధికారిని మట్టికరిపించాలనే పట్టుదలను మమతా బెనర్జీ ప్రదర్శిస్తోన్నారు.
ఆయనను అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వనంటూ ప్రతిజ్ఞ చేసిన మమతా బెనర్జీ.. దాన్ని చేతల్లో చూపించారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేయడానికి నందిగ్రామ్ను ఎంచుకున్నారు. తన పాత నియోజకవర్గం భవానీపురాను వదిలి పెట్టారు. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉంటూ వచ్చిన నందిగ్రామ్ను తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 2009 ఉప ఎన్నిక తరువాత.. ఆ స్థానాన్ని తృణమూల్ ఎప్పుడూ ఓడిపోలేదు. అలాంటి స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేస్తోన్న సువేందు అధికారి ఏ మేరకు ఆశించిన ఫలితాన్ని సాధిస్తారనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
తన వల్లే నందిగ్రామ్ నియోజకవర్గం తృణమూల్ కాంగ్రెస్ వశమైందని, పార్టీ రహితంగా.. తనను చూసే ఓటు వేసే అభిమానులు ఉన్నారనేది సువేందు అధికారి వాదన. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 12వ తేదీన నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి సమాయాత్తమౌతోన్నారు. అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. సంప్రదాయబద్ధమైన ఓటు బ్యాంకుపై ఆధారపడి మమతా బెనర్జీ.. నందిగ్రామ్ బరిలో దిగారు. పశ్చిమ బెంగాల్లో హాట్ సీట్గా మారిన నందిగ్రామ్ పోరు ఎలా ఉంటుందనేది దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.