మర్డర్స్ మిస్టరీ: ఒకే ఇంట్లో మృతదేహాలు: తల పగిలి..రక్తపుమడుగులో: ఫ్యాన్కు వేలాడుతూ
కోల్కత: పశ్చిమ బెంగాల్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అయిదు మృతదేహాలు లభించాయి. కొద్దిరోజుల కిందట కనిపించకుండా పోయిన ఆ కుటుంబం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. మృతదేహాలన్నీ వారి ఇంట్లోనే లభ్యం అయ్యాయి. ఊరికి వెళ్తున్నామంటూ ఇరుగుపొరుగుకు చెప్పిన ఆ కుటుంబ సభ్యులందరూ వారి ఇంట్లోనే రక్తపుమడుగులో కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటన వెనుక కారణం ఏమిటనే విషయంపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఇంటి పెద్ద ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
మృతుల్లో ఇద్దరు చిన్నపిల్లలు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పురుషుడి మృతదేహం ఫ్యాన్కు ఉరి వేసుకున్న స్థితిలో లభించింది. మిగిలిన నాలుగు మృతదేహాలు కూడా తలలు పగిలి, రక్తపుమడుగులో కనిపించాయి. సమాచారం అందుకున్నవెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టమ్ కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్ దక్షిణ దినాజ్పూర్ జిల్లాలోని జమాల్పూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇద్దరు చిన్నపిల్లలు, ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసిన తరువాత.. ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తల పగులగొట్టి హత్య చేశారని నిర్ధారించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం సంఘటనా స్థలంలో లభించలేదని, దాని కోసం గాలిస్తున్నామని అన్నారు. పిల్లలతో పాటు మహిళలను పదునైన ఆయుధం లేదా బలమైన వస్తువుతో తలపై మోది హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు.
తల పగలిన స్థితిలో రక్తపు మడుగులో నాలుగు మృతదేహాలు కనిపించాయని, పురుషుడి మృతదేహం ఉరి వేసుకున్న స్థితిలో లభించిందని చెప్పారు. హత్య చేసిన అనంతరం ఆ వ్యక్తి ఉరి వేసుకుని ఉండొచ్చని అన్నారు. ఈ సామూహిక హత్యలకు పాల్పడటానికి గల కారణం ఏమిటో ఇంకా తెలియరాలేదని, దీనికోసం అన్వేషిస్తున్నామని చెప్పారు. మృతుల మధ్య ఉన్న సంబంధాలు ఏమిటనేది తేలాల్సి ఉందని అన్నారు. దీనికోసం తాము వారి బందువులు, స్నేహితులను విచారిస్తున్నామని చెప్పారు. హత్యకు గల కారణం ఏమిటనేది త్వరలోనే తేలుతుందని అన్నారు.