కాషాయ ఘాటు: జనంలో ఫైర్ బ్రాండ్: బీజేపీ కంచుకోటలో మార్నింగ్ వాక్
కోల్ కత: ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితాలు ఎలాంటి వారినైనా నేలకు దిగొచ్చేలా చేస్తాయి. తన రాజకీయ ప్రత్యర్థి బలపడుతున్నాడంటే ఒళ్లు దగ్గర పెట్టుకునేలా చేస్తాయి. అధికారంలో ఉన్న నాయకులకు ఈ ఉలికి పాటు మరింత అధికంగా ఉంటుంది. జనం దృష్టిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించడానికి పురి గొల్పుతాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విషయంలో ఇదంతా అచ్చు గుద్దినట్లు సరిపోతోంది. పశ్చిమ బెంగాల్ లో ఒకటి, అరా సీట్లకే పరిమితమైన భారతీయ జనతాపార్టీ మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఏ స్థాయిలో అక్కడ విజయం సాధించిందో తెలిసిందే.
కంటైనర్ లో 39 మృతదేహాలు..కుళ్లిపోయిన స్థితిలో: పోలీసుల అదుపులో డ్రైవర్
2014 లోక్ సభ ఎన్నికల్లో రెండు సీట్ల మాత్రమే పరిమితమైన కాషాయ పార్టీ.. మొన్నటి ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాలకు ఎగబాకింది. తమ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కనివ్వబోమంటూ హూంకరించిన మమతా బెనర్జీకి ఎన్నికల ఫలితాలు హై ఓల్టేజీ షాక్ ను ఇచ్చాయి. దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన మమతా బెనర్జీ.. సాదాసీదాగా కనిపిస్తుంటారనే విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి అనే గర్వం రానివ్వరు. సాధారణ ప్రజలతో మమేకం అవుతుంటారు. అదే బాటలో నడుస్తున్నారు మమతా బెనర్జీ. తన వ్యూహాన్ని మార్చారు. తన పాత అలవాట్లు, పాత సంప్రదాయానికి తెర తీశారు.
రాజధాని కోల్ కతకు సుమారు 600 దూరంలో ఉన్న ఓ పట్టణంలో బస చేశారు. పశ్చిమ బెంగాల్ ఉత్తర ప్రాంతంలోని డార్జిలింగ్ జిల్లాలోని కుర్సెయాంగ్ అనే పట్టణంలో బుధవారం ఉదయం మార్నింగ్ వాక్ చేశారు. బీజేపీ బలంగా ఉన్న జిల్లాల్లో డార్జిలింగ్ ఒకటి. మొన్నటి లోక్ సభ ఎన్నికల సందర్భంగా డార్జలింగ్ లోక్ సభ స్థానాన్ని కమలనాథులు కైవసం చేసుకున్నారు. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఆ జిల్లాలో కాషాయ జెండా ఎగురుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మమతా బెనర్జీ.. ఆ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
తన పర్యటనలో భాగంగా ఈ తెల్లవారు జామున ఆమె సుమారు ఆరు కిలోమీటర్లు కాలి నడకన కలియ తిరిగారు. తేయాకు తోటల్లో పనిచేసే మహిళా కార్మికులతో మంతనాలు సాగించారు. పాఠశాలలకు వెళ్లడానికి రెడీ అవుతున్న చిన్నారులను పలకరించారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. పాఠశాలల గేట్ల వద్ద నిల్చుని మరీ మమతా బెనర్జీ చిన్నపిల్లలు, వారి తల్లిదండ్రులతో మాట్లాడటం కనిపించింది. నడి రోడ్డు మీదే స్థానిక మున్సిపల్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక స్థితిగతులపై ఆరా తీశారు. మౌలిక సదుపాయాలను కల్పించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎక్కడో కోల్ కతలో ఉండాల్సిన ముఖ్యమంత్రి తమ మధ్య తిరుగాడటం కుర్సియాంగ్ లో చర్చనీయాంశమైంది. ఇదంతా ఎన్నికల స్టంటేనని భారతీయ జనతాపార్టీ విమర్శలు మొదలు పెట్టింది. 2021లో రాష్ట్ర అసెంబ్లీకి నిర్వహించే ఎన్నికల్లో అధికారాన్ని అందుకోవడం ఖాయమని, దీన్ని అడ్డుకోవడానికి మమతా బెనర్జీ పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలు మాత్రం వేరుగా ఉన్నాయి. బీజేపీ దెబ్బకు మసక బారుతోన్న పార్టీ ప్రతిష్ఠను నిలబెట్టడానికి మమతా బెనర్జీ తన పాత శైలిని అనుసరిస్తున్నారని అంటున్నారు.