రంగంలోకి మమత: మోడీకి శివసేన ఝలక్, నితీష్ అండ
న్యూఢిల్లీ: పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్ వరకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం నాడు ర్యాలీ నిర్వహించారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు కారణంగా దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెబుతూ టీఎంసీతో పాటు వివిధ పార్టీలు కలిసి ర్యాలీ నిర్వహించాయి.
ఈ ర్యాలీలో ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని ఎంపీలు డిమాండ్ చేశారు. బీజేపీ మిత్రపక్షమైన శివసేన ర్యాలీలో పాల్గొని ఝలక్ ఇచ్చింది. కాంగ్రెస్, వామపక్షాలు ఈ ర్యాలీకి దూరంగా ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ మాత్రం పాల్గొనలేదు.
మరోవైపు, నోట్ల రద్దుపై ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రధాని మోడీని విమర్శిస్తుంటే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాత్రం ఆయనను వెనకేసుకొస్తున్నారు. ఎవరేమన్నా తాను మాత్రం నోట్ల రద్దును పూర్తిగా సమర్థిస్తానని చెప్పారు. నోట్ల రద్దు వల్ల నకిలీ నోట్ల బెడద పోతుందన్నారు.
అదే సమయంలో ఆయన బినామీ ఆస్తులు కలిగి ఉన్నవారిపై సాధ్యమైనంత త్వరగా దాడులు ఉధృతంగా జరపాలని మోడీకి సూచించారు. మధుబనిలో జరిగిన ఒక కార్యక్రమంలో నితీశ్ మాట్లాడారు. పార్లమెంట్ లోపలా, బయట ప్రతిపక్షాలు ప్రధానిపై తీవ్రంగా విరుచుకుపడుతున్న తరుణంలో నితీశ్ మద్దతు మోడీకి కొండంత బలం అంటున్నారు.