దేశాన్ని అవమానిస్తారా?: బీజేపీ ఎదురుదాడితో తగ్గిన మమతా బెనర్జీ, ‘ఒపీనియన్ పోల్’ మాత్రమే..
న్యూఢిల్లీ/కోల్కతా: భారతీయ జనతా పార్టీకి దమ్ముంటే సీఏఏ, ఎన్ఆర్సీపై ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి అని సవాల్ విసిరిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ నుంచి తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కాస్త వెనక్కి తగ్గారు.
ఏం మాట్లాడుతున్నారో ఆమెకైనా తెలుస్తోందా?: అదే భయమంటూ మమతా బెనర్జీపై కిషన్ రెడ్డి ఆగ్రహం
క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ..
కాగా, మమతా బెనర్జీ తాను చేసిన వ్యాఖ్యలకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఏఏ, జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ)పై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని బీజేపీ ప్రభుత్వానికి మమతా బెనర్జీ సవాల్ విసిరారు. కోల్కతా సీఏఏ నిరసన ర్యాలీలో మమత మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
ఐక్యరాజ్యసమితిలో ప్రజాభిప్రాయ సేకరణ అంటూ..
బీజేపీకి దమ్ముంటే సీఏఏ, ఎన్ఆర్సీలపై ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి అని డిమాండ్ చేశారు. అంతేగాక, ఈ ఓటింగ్లో ఓడిపోయినట్లయితే అధికారం నుంచి బీజేపీ తప్పుకోవాలన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకునేంత వరకు నిరసనలు విరమించవద్దని ప్రజలను మమతా కోరారు.
బీజేపీ ఎదురుదాడితో వెనక్కి తగ్గిన మమతా బెనర్జీ..
ఈ నేపథ్యంలో కేంద్రమంత్రులు సహా బీజేపీ నేతలు మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వెనక్కి తగ్గిన మమతా బెనర్జీ.. తాను ‘ఒపీనియన్ పోల్' మాత్రమే కోరానని.. ‘రెఫరాండం' కోరలేదని వ్యాఖ్యానించారు. మానవ హక్కుల సంఘం లాంటి నిపుణుల అభిప్రాయలను తీసుకోవాలని మాత్రమే తాను కోరినట్లు మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. నాకు నా దేశం, నా ప్రజలపై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. సీఏఏ, ఎన్ఆర్సీపై తాను ఒపీనియన్పోల్ కోరుతున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సీఏఏ, ఎన్ఆర్సీని అమలు చేయబోమని మమతా బెనర్జీ ఇప్పటికే తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
దేశాన్ని అవమానిస్తారా? అంటూ స్మృతీ ఇరానీ ఆగ్రహం
ఆమె ఏం మాట్లాడుతున్నారో ఆమెకైనా తెలుసా? అంటూ ఇప్పటికే మమతా బెనర్జీపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మరో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా మమతపై మండిపడ్డారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలు భారత పార్లమెంటును అవమానించేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.