మమతా బెనర్జీ కీలక నిర్ణయం: విమానాలు, మెట్రో, లోకల్ ట్రైన్ సేవలు ప్రారంభం
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 20 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతాయని ప్రకటించారు. సెప్టెంబర్ 7, 11, 12 తేదీల్లో రాష్ట్రమంతటా సంపూర్ణ లాక్డౌన్ అమలవుతుందని స్పష్టం చేశారు. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం ఆమె మాట్లాడారు.
అంతేగాక, భౌతిక దూరం, ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తూ మెట్రో రైలు సేవలను పునరుద్ధరిస్తామని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. సెప్టెంబర్ 20 వరకు రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలు, అన్ని విద్యా సంస్థల మూసివేత కొనసాగుతుందని చెప్పారు. ఆరు కరోనా హాట్ స్పాట్ రాష్ట్రాల నుంచి విమాన సర్వీసుల పునరుద్ధరణను అనుమతించారు.
సెప్టెంబర్ 1 నుంచి ఈ రాష్ట్రాల నుంచి వారానికి మూడు రోజులపాటు విమాన రాకపోకలను పునరుద్ధరిస్తామని సీఎం మమత తెలిపారు. కరోనా కట్టడికి ఆగస్టు 31 వరకూ ఢిల్లీ, ముంబై, చెన్నై, పుణె, నాగపూర్, అహ్మాదాబాద్ నుంచి కోల్కతాకు ప్రయాణికుల విమానాలను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు విమానయాన శాఖను కోరింది.
కరోనా మహ్మారిని నిరోధించేందుకు పీఎం కేర్స్ ఫండ్ నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపిణీ చేయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. జీఎస్టీ బకాయిలను కూడా కేంద్రం చెల్లించడం లేదని బుధవారం సోనియా గాంధీతో జరిగిన బీజేపీయేతర సీఎంల సమావేశంలో మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు.
Recommended Video
సెప్టెంబర్ 1 నుంచి మెట్రో సేవలు, లోకల్ ట్రైన్స్ సేవలు అందుబాటులకి వస్తాయని మమతా బెనర్జీ తెలిపారు. అయితే, భౌతిక దూరం, మాస్కులు ధరించడం లాంటి నిబంధనలను ప్రజలు పాటించాలని కోరారు.