లక్కీ డే! లక్కీ రూమ్!!: మమతా బెనర్జీని ఆ మూఢనమ్మకమే గెలిపిస్తుందా? అంతా షాక్
కోల్కతా: ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ నాయకులు దేవాలయాలు, ప్రార్థనాలయాల చుట్టూ తిరుగుతుంటారు. అంతేగాక, వారి నమ్మకాలు, మూఢ నమ్మకాలను గుడ్డిగా నమ్ముతూ ముందుకు సాగుతుంటారు. అప్పుడు ఇలా చేస్తేనే గెలిచాం.. ఇప్పుడు కూడా అలానే చేయాలని ముందుకు కదులుతారు. ఇప్పుడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తన (మూఢ)నమ్మకాలను మరోసారి ఫాలో అయ్యారు.
మూడోసారి సీఎం సీటు కోసం మమతా బెనర్జీ
ముచ్చటగా మూడోసారి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని ఎంతో పట్టుదలతో ఉన్న మమతా బెనర్జీ తనకు కలిసివచ్చే శుక్రవారం రోజున తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అంతేగాక, రెండుసార్లు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిన తన లక్కీ రూమ్(చిన్న గది) నుంచే ఈ ప్రకటన చేయడం గమనార్హం.
మమతా బెనర్జీ లక్కీ డే, లక్కీ రూమ్ ఇవే..
కోల్కతాలోని కాళీఘాట్లోని చిన్న గదినే మమతా బెనర్జీ తన లక్కీ రూమ్గా నమ్ముతారు. ఈసారి బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో మరోసారి మమతా బెనర్జీ తన సెంటిమెంట్లపై దృష్టిసారించారు. అందుకే ఈసారి తన లక్కీ డే శుక్రవారం రోజున, తన లక్కీరూమ్లోనే టీఎంసీ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం.
ఆ రెండు ఎన్నికల్లోనూ మమతా బెనర్జీ పార్టీ ఘన విజయం అందుకేనా?
ఎందుకంటే, 2011, 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా ఈ చిన్న గదిలో నుంచే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఆ నాటి నుంచి శుక్రవారం తోపాటు ఈ చిన్న గది మమతా బెనర్జీకి సెంటిమెంటుగా మారింది.
2019లో లక్కీ రూమ్ను కాదనుంటే.. మమతా బెనర్జీకి షాకిచ్చిన బీజేపీ
అయితే, 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం మమతా బెనర్జీ ఈ లక్కీ గది నుంచి కాకుండా వేరే పెద్ద హాలులో మీడియాను పిలిచి టీఎంసీ పార్టీ లోక్సభ అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు మమతకు షాకిచ్చేలా వచ్చాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో టీఎంసీకి ఊహించని షాక్ తగిలింది. 42 ఎంపీ స్థానాల్లో 40 స్థానాలు గెలుచుకుందామనుకున్న మమతా బెనర్జీకి బీజేపీ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా బీజేపీ 18 స్థానాల్లో విజయభేరి మోగించింది.
మమతా బెనర్జీ (మూఢ'నమ్మకంతో మీడియా ప్రతినిధులంతా షాక్
ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ మరోసారి తన లక్కీ రూమ్(కాళీఘాట్లోని గది), లక్కీ డే శుక్రవారం రోజున తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. చిన్న గదిలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో మీడియా ప్రతినిధులు కొంత ఇబ్బంది పడటంతోపాటు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంత చిన్న గదిని ఎందుకు ఎంచుకున్నారని తర్జనభర్చనలు పడ్డారు. అయితే, అసలు విషయం తెలిసి షాకయ్యారు. పలువురు టీఎంసీ నేతలు ఈ లక్కీ డే, లక్కీ రూమ్ గురించి మీడియా ప్రతినిధులకు తెలపడంతో అదా సంగతి అనుకున్నారంతా. కాగా, మార్చి 27న తొలి విడత ఎన్నికలు ప్రారంభం కానుండగా, ఏప్రిల్ 29న చివరి 8వ విడత ఎన్నికలు బెంగాల్ రాష్ట్రంలో జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడతాయి.