మమతా బెనర్జీకి మరో షాక్: బీజేపీలోకి టీఎంసీ అభ్యర్థితోపాటు నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు
కోల్కతా: కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ భారీ షాక్ తగిలింది. మరో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మరో సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు.
అయితే, త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నేతలకు టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ టికెట్ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే వారంతా బీజేపీలో చేరారు. ఇటీవల 291 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మమతా బెనర్జీ 23 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించిన విషయం తెలిసిందే.
కాగా, ఇప్పటికే అధికార టీఎంసీ నుంచి కీలక నేతలతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరారు. కొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో కూడా బీజేపీలోకి వలసలు కొనసాగుతుండటం గమనార్హం.
తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొనాలీ గుహా, దీపేందు బిశ్వాస్, రవీంద్రనాథ్ భట్టాచార్య, జాటు లాహిరితో పాటు హబీబ్పూర్ టీఎంసీ అభ్యర్థి సరళ ముర్ము కూడా బీజేపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, ఆ పార్టీ నేతలు సువేందు అధికారి, ముకుల్ రాయ్ సమక్షంలో వీరంతా కాషాయ కండువా కప్పుకున్నారు. అధికార టీఎంసీ, బీజేపీల మధ్యే తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ప్రచారంలోనూ ఈ రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్లు దూసుకెళ్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్ ఇతర కీలక నేతలంతా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బంగారు బెంగాల్ కావాలంటే బీజేపీకి ఓటేయాలంటూ మోడీ, షాలు రాష్ట్ర ప్రజలను కోరుతున్నారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు బెంగాల్ రాష్ట్రంలో 8 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.