బెంగాల్లో ప్రశాంత్ కిశోర్ భారీ స్కెచ్: అధికార భాషగా తెలుగు: మమతా కేబినెట్ గ్రీన్ సిగ్నల్
కోల్కత: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న పశ్చిమ బెంగాల్లో రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్కు చెందిన కీలక నేతలను భారతీయ జనతా పార్టీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే సువేందు అధికారి సహా కొందరు ఎమ్మెల్యేలు. ఓ లోక్సభ సభ్యుడు కమలదళంలో చేరిపోయారు. ఎన్నికల ముంగిట్లోసంభవిస్తోన్న ఈ పరిణామాలు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ వ్యతిరేక ఓటుబ్యాంకును మరింత కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రశాంత్ కిశోర్ స్కెచ్..
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. ప్రస్తుతం మమతా బెనర్జీ టీమ్లో ఉన్నారు. దూకుడును ప్రదర్శిస్తోన్న బీజేపీ నేతలను నిలువరించడానికి వ్యూహాలను రూపొందిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ సంప్రదాయబద్ధ ఓటుబ్యాంకును కాపాడుకుంటూనే.. బీజేపీ వ్యతిరేకులు, తటస్థులు, వామపక్ష భావజాలం ఉన్న నేతలనూ పార్టీ వైపు ఆకర్షితులను చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా- కొన్ని కీలక నిర్ణయాలను అధికార పార్టీ తీసుకుంటోంది. అన్ని వర్గాలు, వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన పశ్చిమ బెంగాల్లో స్థిరపడిన వారి ఓటర్లను మొగ్గు చూపేలా చర్యలు చేపట్టింది.
తెలుగును అధికార భాషగా..
ఈ వ్యూహాల్లో భాగంగా తెలుగును అధికార భాషగా గుర్తించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే బెంగాల్లో 10 వరకు అధికార భాషలు ఉన్నాయి. తాజాగా తెలుగును కూడా అధికార భాషగా గుర్తించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించింది. తెలుగును అధికార భాషగా గుర్తించింది. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో బాగా పరిచయం ఉన్న ప్రశాంత్ సూచనల మేరకే మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
తెలుగు ప్రజల డిమాండ్ మేరకు..
తెలుగును అధికార భాషగా ప్రకటించాలని బెంగాల్ లోని తెలుగు ప్రజలు గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఖరగ్పూర్, మేదినిపూర్, నారాయణ్పూర్, డాంటన్, ఎగ్రా వంటి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో మేదినిపూర్ లోక్సభ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. దీనికి తెలుగు ప్రజల ఓటుబ్యాంకు పనిచేసిందని తృణమూల్ కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. ఆ ఓటుబ్యాంకును మల్లీ పార్టీ వైపు ఆకర్షితులను చేయడంలో భాగంగా.. తెలుగును అధికారిక భాషగా గుర్తించినట్లు చెబుతున్నారు.