వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ తీర్మానం -సీఎం మమత కీలక వ్యాఖ్యలు
వివాదాస్పదంగా మారిన కేంద్ర వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ సర్కారు గురువారం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పార్థ చటర్జీ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు.
పాక్ సుప్రీం అనూహ్యం -టెర్రరిస్టు ఒమర్ సయీద్ విడుదల -జర్నలిస్టు డానియెల్ హత్య కేసులో ట్విస్ట్
కొత్త సాగు చట్టాలు రైతులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని, ఈ చట్టాల కారణంగా ప్రభుత్వం బలవంతంగా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లను నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొన్నట్టు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తీర్మానంలో పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థ కుప్పకూలడంతో పాటు... అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ పెరిగేందుకు నూతన వ్యవసాయ చట్టాలు కారణమయ్యాయని తీర్మానంలో రాసుకొచ్చింది. కాగా..
మంత్రి చటర్జీ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టగానే బీజేపీ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకొచ్చి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ''జై శ్రీరాం'' అని నినాదాలు చేస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ప్రజలు చేపట్టే ప్రతి ఆందోళనను తీవ్రవాద చర్యగా ముద్రవేయడం బీజేపీకి బాగా అలవాటైందని మండిపడ్డారు. అంతేకాదు..
చంద్రబాబుపై నిమ్మగడ్డ చర్యలు? -పార్టీ రహిత ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టోనా? -వైసీపీ తీవ్ర అభ్యంతరం
సాగు చట్టాలు రైతులకు పూర్తి వ్యతిరేకమని, పార్లమెంటులో వాటిని బలవంతగా ఆమోదింపజేసుకున్నారని, రైతులపై ఉగ్రవాదుల ముద్ర వేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని మమత అన్నారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే దిశగా ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నిజానికి..
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కంటే ముందుగానే పంజాబ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కేరళ, ఢిల్లీ అసెంబ్లీలు తీర్మానాలు చేశాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో వేలాది మంది రైతులు గడిచిన రెండు నెలలుగా నిరసనలు కొనసాగిస్తున్నారు.