పార్లమెంట్లో ''బెంగాల్'' సెగ.. దద్ధరిల్లిన ఉభయసభలు
ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ సెగ దేశ రాజధానిని తాకింది. మోడీ వర్సెస్ దీదీ రీతిన సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం పార్లమెంటుకు చేరింది. చిట్ఫండ్ కుంభకోణంలో కోల్కతా నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను ప్రశ్నించడానికి సీబీఐ అధికారులు ఆ రాష్ట్రానికి రావడం దుమారం రేపింది. ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగి సెంట్రల్ గవర్నమెంట్ పై ఆరోపణలు చేయడం చర్చానీయాంశమైంది. కేంద్రం తీరును నిరసిస్తూ దీదీ దీక్షకు దిగడంతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలిచారు.
బెంగాల్ సెగ పార్లమెంట్ ను తాకడంతో ఉభయసభలు దద్ధరిల్లాయి. బెంగాల్ పై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంభిస్తోందని మండిపడ్డారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు. కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. పెద్దపెట్టున నినాదాలు చేయడంతో సభా సమావేశాలకు ఆటంకం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఆజమాయిషీ సరికాదని వ్యాఖ్యానించారు. తృణమూల్ నేతలకు మద్దతుగా విపక్షాలు కూడా జై కొట్టాయి. దీంతో ఉభయసభలు వాయిదా పడ్డాయి.