దసరా మండపాల్లో దుర్గమ్మ విగ్రహాలు కాదు..వలస కార్మిక మహిళ మూర్తులు: స్త్రీశక్తికి అద్దం పట్టేలా
కోల్కత: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ను అమల్లోకి తీసుకొచ్చిన తొలిరోజుల్లో- వలస కార్మికుల బతుకు ప్రయాణం..ఇప్పట్లో ఎవరూ మరిచిపోలేనిది.. చరిత్ర ఎప్పటికీ విస్మరించలేనిది. కాళ్లీడ్చుకుంటూ ఒక దిక్కు నుంచి మరో దిక్కునకు వందల కిలోమీటర్లను అధిగమించారు. గమ్యస్థానాన్ని చేరుకోవడంలో ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కొన్నారు.
అన్ని రకాల రవాణా అవసరాలు అందుబాటులో ఉన్న ఆధునిక కాలంలోనూ లక్షలాది మంది వలస కార్మికులు దక్షిణాది నుంచి ఉత్తరాదికి బయలుదేరి వెళ్లిన ఉదంతం.. వారి పట్టుదలను, గమ్యాన్ని చేరుకోవాలనే కాంక్షను ప్రపంచానికి చాటిచెప్పింది. వలస కార్మిక కుటుంబాలకు చెందిన మహిళలు తమ పిలల్లను మోస్తూ సాగించిన ప్రయాణం స్త్రీశక్తికి అద్దం పట్టింది. లాక్డౌన్ వల్ల ఉపాధిని కోల్పోయినప్పటికీ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో వారు తల్లిలాంటి స్వస్థలాల వైపు అడుగు వేశారు. వందల కిలోమీటర్లను అధిగమించారు.
అందుకే- వలస కార్మిక మహిళలను అపర కాళికలా పూజించనున్నారు బెంగాలీలు. దసరా పండుగ సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతలో నెలకొల్పబోయే మండపాల్లో కాళిక విగ్రహాలకు బదులుగా వసల కార్మిక కుటుంబాలకు చెందిన మహిళల విగ్రహాలను ఉంచబోతున్నారు. దుర్గమ్మలా ఆ విగ్రహాలను పూజించబోతున్నారు. వసల వెళ్లే సమయంలో ఆ మహిళలు ఎలా కనిపించారో.. దానికి ప్రతిబింబలా విగ్రహాలను రూపొందించారు.
Migrant Mother as Goddess Durga at a Durga Puja Pandal this year
— Dheeraj Aap ( Fan Of Ak & Ms ) (@AapActive123) October 15, 2020
The idol of a migrant worker mother, a shirtless toddler (Kartick) in her arms, that will be worshipped as Goddess Durga at Barisha Club in Behala, West Bengal
Heart-touching! https://t.co/RsCm4L2D91 pic.twitter.com/eHej5ymX8R
Recommended Video
ఒక వైపు పిల్లలను ఎత్తుకుని.. మరోవైపు సంచులను మోస్తూ.. వారు ఎలా కనిపించారో.. అదే రూపంలో వలస కార్మిక మహిళల విగ్రహాలను రూపొందించారు. వాటిని దుర్గా మండపాల్లో ఉంచి పూజించబోతున్నారు. కోల్కత బెహలా ప్రాంతానికి చెందిన బారిష క్లబ్ దుర్గా పూజా కమిటీ ఈ విగ్రహాలను నెలకొల్పబోతోంది. శనివారం దసరా పండుగ సందర్భంగా ఆ విగ్రహాలను దసరా మండపాల్లో ఉంచి పూజించబోతున్నట్లు వెల్లడించింది. అవసరం వచ్చినప్పుడు కొండలాంటి కష్టాన్నయినా ఢీ కొట్టి విజయం సాధించగలమనే విషయాన్ని వలస కార్మిక మహిళలు ఈ ఘటనతో తెలియజేశారని, అందుకే- వారిని అమ్మవారిలా పూజించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.