కోల్కతాలో కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ప్రారంభం: మంత్రికే తొలి షాట్, మరో సీఎంకు వ్యాక్సిన్
కోల్కతా: హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో ప్రారంభమయ్యాయి. ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్ బుధవారం ఈ ట్రయల్స్ ప్రారంభించారు.
కోవాగ్జిన్ దేశీయంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్. కోవాగ్జిన్ తొలి రెండు దశల్లో జరిగిన క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తైన నేపథ్యంలో మూడో దశ ప్రయోగాలకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతించిన విషయం తెలిసిందే.
బుధవారం మూడో దశ రెగ్యులేటరీ ట్రయల్ను ఐసీఎంఆర్-ఎన్ఐసీఈడీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా బెంగాల్ గవర్నర్ జగదీప్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 25 కేంద్రాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో ఒకటైన ఎన్ఐసీఈడీలో ప్రారంభిస్తున్న ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
దేశం సమర్థవంతంగా కరోనా వైరస్ కట్టడికి కృషి చేసిందన్నారు. ఉచిత ఆరోగ్య సేవలను అందించే ఆయుష్మాన్ భారత్ పథకం చాలా మందికి సహాయాన్ని అందించిందని తెలిపారు. కేంద్రం నిర్దేశించిన నిబంధనలకు బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఈ రాష్ట్రంలో పథకం అమలు కావడం లేదన్నారు.
కాగా, పశ్చిమబెంగాల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హద్ హకీమ్ తొలి వాలంటీర్గా తానే కోవాగ్జిన్ షాట్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
ఇది ఇలావుంటే, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తాను తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకుంటానని ప్రకటించారు. ఆరోగ్య సిబ్బంది కంటే తాను ముందే తీసుకుంటానని, ఆ తర్వాత రాష్ట్రంలోని వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి వ్యాక్సిన్ అందజేయనున్నట్లు తెలిపారు. కాగా, కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ను తొలుతగా ఆరోగ్య సిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.