కరోనా : చివరి చూపుకూ వెల కట్టారు... కన్నతండ్రిని కడసారి చూసుకోలేకపోయిన కొడుకు...
కరోనా పేషెంట్ల పట్ల కొన్ని ఆస్పత్రులు అత్యంత నిర్దయగా వ్యవహరిస్తున్నాయి. కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండానే ఓ కోవిడ్ 19 పేషెంట్ను శ్మశానానికి తరలించిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. చివరకు,కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నప్పటికీ... మృతుడిని చూసేందుకు రూ.51వేలు చెల్లించాలని డిమాండ్ చేయడం గమనార్హం.
అసలేం జరిగింది...
మృతుడు హరి గుప్తా కుమారుడు సాగర్ గుప్తా మాట్లాడుతూ...'ఆదివారం మధ్యాహ్నం మాకు ఆస్పత్రి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. శనివారం అర్ధరాత్రి తర్వాత ఒంటి గంట సమయంలో మా నాన్న చనిపోయినట్లు చెప్పారు. అయితే ముందే ఎందుకు చెప్పలేదని మేము వాళ్లను ప్రశ్నించాం. అందుకు,మీ ఫోన్ నంబర్స్ మా వద్ద లేవని వాళ్లు బదులిచ్చారు.' అని సాగర్ స్పష్టం చేశారు.ఆస్పత్రి నుంచి ఫోన్ రాగానే సాగర్,అతని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు.
రూ.51వేలు చెల్లిస్తేనే...
అయితే తీరా అక్కడికెళ్లాక... అప్పటికే మృతదేహాన్ని శిబ్పూర్లోని శ్మశానానికి తరలించారు. దీంతో ఆ శ్మశానం వద్దకు వెళ్లగా... మృతదేహాన్ని దహనం చేసేందుకు ఆస్పత్రి యాజమాన్యం పంపించిన సిబ్బంది వారికి అడ్డు తగిలారు. రూ.51 వేలు చెల్లిస్తేనే కడసారి చూపుకు అనుమతిస్తామన్నారు. అయితే తమ వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో చివరకు రూ.20వేలు తగ్గించారు.అంత డబ్బు కూడా లేదని చెప్పినా వినిపించుకోలేదు. కన్నతండ్రిని చివరి చూపు చూసుకోవడానికి కూడా ఇన్ని ఇబ్బందులు ఎదురవడంతో అతనితో తల్లడిల్లిపోయాడు.
పోలీసులు చెప్పినా....
ఏం చేయాలో తెలియక సాగర్ కుటుంబ సభ్యులు చివరకు పోలీసులకు ఫోన్ చేసి అసలు విషయం వివరించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆ సిబ్బందికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వినిపించుకోలేదు. తమ ఆస్పత్రి యాజమాన్యం,ఉన్నతాధికారులతో మాట్లాడాలని చెప్పారు. ఈ తతంగాన్ని వీడియో తీసేందుకు యత్నించగా... సాగర్ కుటుంబ సభ్యుల సెల్ఫోన్స్ కూడా వారు లాక్కున్నారు.
చివరి చూపు దక్కకుండానే...
చివరకు,హరి గుప్తా కుటుంబ సభ్యులు అతని కడసారి చూపుకు నోచుకోలేకపోయారు. ఆ సిబ్బంది కుటుంబాన్ని అనుమతించకుండానే దహన సంస్కారాలు నిర్వహించారు. దీనిపై ఆస్పత్రి యాజమాన్యం స్పందిస్తూ... తమ వద్ద అతని కుటుంబ సభ్యుల కాంటాక్ట్స్ లేవని,అందుకే నేరుగా శ్మశానానికి తరలించామని పేర్కొంది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించేలా వ్యవహరించిన ఆ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని హరి గుప్తా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అతనిపై కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు.
దోచుకుంటున్న కార్పోరేట్ ఆస్పత్రులు..
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ఇలాంటి అనేక సంఘటనలు వెలుగుచూశాయి. కొన్ని ఆస్పత్రుల్లో మృతదేహాలు తారుమారు కాగా... మరికొన్ని ఆస్పత్రుల్లో బిల్లులు కట్టనిదే మృతదేహాన్ని చూడనివ్వమంటూ కుటుంబ సభ్యులను ఆస్పత్రి యాజమాన్యాలు వేధించాయి. చాలా చోట్ల లక్షల రూపాయల బిల్లులు వసూలు చేస్తూ పేషెంట్లను దోచుకుంటున్నాయి. ఇటీవల హైదరాబాద్లోనూ పలు కార్పోరేట్ ఆస్పత్రులు ఇలాగే దోపిడీకి పాల్పడిన ఘటనలు వెలుగుచూశాయి. ఈ క్రమంలో డెక్కన్ ఆస్పత్రికి కోవిడ్ 19 అనుమతులను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.