తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త కాల్చివేత: భగ్గుమన్న బెంగాల్: అట్టుడుకుతోన్న హౌరా
కోల్కత: మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న పశ్చిమ బెంగాల్ హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి.. అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. పలు దాడులు, ప్రతిదాడులతో అట్టుడికిపోతోన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడం ఈ హింసాత్మక పరిస్థితులకు దారి తీసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటించిన నందిగ్రామ్లోనూ దాడుల ఘటనలు చోటు చేసుకున్నాయి.
తృణమూల్ కార్యకర్తపై కాల్పులు..
హౌరాలో గుర్తు తెలియని వ్యక్తులు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తను కాల్చి చంపారు. బొటానికల్ గార్డెన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. షాలిమార్ రైల్వే స్టేషన్ వైపు బైక్పై వెళ్తోన్న అతణ్ని అడ్డుకున్న దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మరణించారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతణ్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడిని టీఎంసీ యువజన విభాగం కార్యకర్త ధర్మేంద్ర సింగ్గా గుర్తించారు. ఈ ఘటన తరువాత హౌరాలో హింస చెలరేగింది.
ప్రతిదాడులతో అట్టుడికిన హౌరా
తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగం నేతలు, కార్యకర్తలు ప్రతిదాడులకు దిగారు. రాజకీయ ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేశారు. బైక్లను తగులబెట్టారు. వందలాది మంది ఈ దాడులకు పాల్పడ్డారు. ఆందోళనలకు దిగారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ప్రభుత్వం ర్యాపిడ్ యాక్షన్ బలగాలను రంగంలోకి దింపింది. ఆందోళనకారులు చెదరగొట్టారు. సహకార శాఖ మంత్రి అరూప్ రాయ్.. ఆసుపత్రిలో ధర్మేంద్ర సింగ్ మృతదేహాన్ని సందర్శించారు. నివాళి అర్పించారు. మరోవంక- నందిగ్రామ్లోనూ రాజకీయ దాడులు చోటు చేసుకున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి.
నందిగ్రామ్లోనూ ఘర్షణలు..
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటనను అడ్డుకోవడానికి భారీగా మోహరించిన బీజేపీ కార్యకర్తలను టీఎంసీ నేతలు అడ్డుకోవడంతో ఈ ఘటన సంభవించింది. నందిగ్రామ్ ఘటనలో రెండు పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసులు 25 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో కొందరిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. బీజేపీ నేతలే ఈ దారుణాలకు కారణమంటూ మంత్రి అరూప్ రాయ్ విమర్శించారు. ఈ సారి అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు.
బీజేపీ ఆటలు సాగనివ్వం
ఇందులో భాగంగానే.. తమ పార్టీ కార్యకర్తలపై ప్రాణాంతక దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ నేతల ఆటలను సాగనివ్వమని హెచ్చరించారు. మరి కొన్నినెలల్లో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ను గద్దె దింపడానికి బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మమతా బెనర్జీ కేబినెట్ మంత్రి సువేందు అధికారి సహా పలువురిని తమ పార్టీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది ముగిసిన లోక్సభ ఎన్నికల్లో అంచనాలకు మించి సీట్లను సాధించింది. అదే ఊపును అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని భావిస్తోంది