దారుణం:పెళ్ళిలో డ్యాన్స్ చేసిందని భార్యను చంపిన భర్త
కోల్కతా: పెళ్ళిలో డ్యాన్స్ చేసిందనే అక్కసుతో భార్యను భర్తే దారుణంగా హత్య చేసిన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 24 పరగణాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. అయితే భార్యను చంపేసి ఆత్మహత్య చేసుకొందని కట్టుకథ అల్లాడు. అయితే పోలీసులు విచారణలో అసలు విషయాలు వెలుగు చూశాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 24 పరగణాల జిల్లాకు చెందిన సప్నా అనే యువతికి సుభీర్ నష్కర్ అనే వ్యక్తితో ఇటీవలనే వివాహమైంది. అయితే బంధువుల ఇంట్లో జరిగిన వివాహనికి శనివారం నాడు సప్నా, సుభీర్ దంపతులు తల్లిదండ్రులతో కలిసి వెళ్ళారు.
ఈ పెళ్ళి వేడుకలో సప్నా అతిథులతో కలిసి డ్యాన్స్ చేసింది. అది సుభీర్కు నచ్చలేదు పెళ్ళిలో అందరి ముందే భార్యతో సుభీర్ గొడవ పెట్టుకొన్నాడు. డ్యాన్స్ ఎందుకు చేశావని నిలదీశాడు. దీంతో సప్నా అలిగి ఇంటికి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత తల్లితో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు సుభీర్. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత సప్నాను సుభీర్ తల్లితో కలిసి చంపేశాడు. అంతేకాదు సప్నా ఆత్మహత్య చేసుకొందని కట్టుకథ అల్లారు.
అయితే సప్నా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో సప్నాను భర్త హత్య చేసినట్టు తేలింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. అంతేకాదు సుభీర్తో పాటు అతడి తల్లిని కూడ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.