ఆదాయం కోసం రైల్వేశాఖ వినూత్న ప్లాన్: రైళ్లలో షాపింగ్ చేయొచ్చు
న్యూఢిల్లీ: రైల్వే శాఖ ఆదాయ మార్గాలు వెతుకుతోంది. మిగతా ప్రయాణ వాహనాలతో పోలిస్తే రైళ్లలో సాధారణ ప్రయాణీకులకు ధరలు అందుబాటులో ఉంటాయి. ఎంతోమంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. సుదూర ప్రయాణాలు చేసేవారికి ప్రయాణ సమయాన్ని సద్వినియోగం చేసుకునే వీలు కల్పించడంతో పాటు, దానికి ఆదాయ మార్గంగా ఉపయోగపడే ప్లాన్ చేస్తోంది.
రైళ్లలో షాపింగ్ మాల్ అనే వినూత్న పథకంతో ముందుకు వస్తోంది. రైల్వే శాఖ రైళ్లలో షాపింగ్ మాల్ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తోంది. దీంతో అవసరం ఉన్న వారు రైళ్లలోనే ప్రయాణం చేసే సమయంలో షాపింగ్ చేయవచ్చు. మీకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు.
రైల్వే శాఖ వినూత్న ఆలోచన
ప్రయాణికులకు అవసరమైన కొన్ని వస్తువులను రైళ్లలోనే అమ్మే విధంగా రైల్వే శాఖ ఆలోచనలు చేస్తోంది. తొలుత వెస్ట్, సెంట్రల్ రైల్వేల్లో ఇన్ ట్రైన్ షాపింగ్ను తీసుకురానున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశముంది. రైల్వే ఆదాయాన్ని పెంపొందించునేందుకు రైల్వే శాఖ వినూత్న ఆలోచనలు చేస్తోంది.
టిక్కెట్ల అమ్మకం ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా
ప్రయాణీకుల టిక్కెట్ల అమ్మకాల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా రూ.1200 కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ మేరకు అన్ని జోనల్ రైల్వేలను కోరింది. ఇందులో భాగంగా ప్రయాణీకులకు షాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చింది.
తొలుత ప్రీమియం, ఆ తర్వాత సుదూర ప్రయాణ రైళ్లకు విస్తరణ
రైళ్లలో ప్రయాణించే వారికి అవసరమైన వస్తువులను అందుబాటులో ఉంచనున్నారు. వాటితో పాటు ఇతర వస్తువులు కూడా అందుబాటులో ఉంచుతారు. బ్యాగులు, సెంట్లు, గడియారాలు తదితర వస్తువులను ప్రయాణీకులకు అందుబటులో ఉంచాలని భావిస్తున్నారు. తొలుత ప్రీమియం రైళ్లలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దూర ప్రయాణ రైళ్లకు విస్తరిస్తారు.
టెండర్లకు ఆహ్వానం
ఇప్పటికే వెస్టర్న్ రైల్వే సెప్టెంబర్లో టెండర్లను ఆహ్వానించనుంది. డిసెంబర్ నుంచి శతాబ్ది ఎక్స్ప్రెస్లో అమ్మకాలు ఉంటాయి. సెంట్రల్ రైల్వే కూడా అక్టోబర్ నుంచి కోణార్క్ ఎక్స్ప్రెస్, చెన్నై ఎక్స్ప్రెస్, ఎర్నాకులం - హజరత్ నిజాముద్దీన్ దురంతో రైళ్లలో షాపింగ్ను ప్రవేశపెట్టే అవకాశముంది.