పీఎంసీ సంక్షోభంపై ఏ నిర్ణయం తీసుకున్నారు.. బీజేపీ డైరెక్టర్లపై చర్యలు తీసుకోరా.. కపిల్ సిబాల్
దేశవ్యాప్తంగా ఒక కుదుపు కుదిపేస్తోన్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు స్కాంపై కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ బ్యాంకు 12 మంది డైరెక్టర్లు బీజేపీకి చెందినవారేనని విమర్శించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కుంభకోణాలమయంగా మారిందని విమర్శించారు.
పీఎంసీ బ్యాంకులో రూ.4 వేల కోట్లకు పైగా స్కాం బయటపడిన సంగతి తెలిసిందే. దీంతో ఖాతాదారుల నగదు విత్ డ్రా పరిమితి విధించారు. తొలుత రూ. వెయ్యి. తర్వాత పదివేలకు పెంచిన సంగతి తెలిసిందే. ఇటీవలే నలుగురు రోగుల బంధువులు డబ్బు విత్ డ్రా చేసుకోలేక ఆస్పత్రిలో చనిపోవడం కలవరానికి గురిచేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ కామెంట్స్ కలకలం రేపింది.
పీఎంసీ బ్యాంకు సంక్షోభ నివారణకు కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఎందుకు జోక్యం చేసుకుంటలేరని మండిపడ్డారు. పీఎంసీకి 12 మంది బీజేపీ డైరెక్టర్లు ఉన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. అందుకోసమే వారిని సీబీఐ అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు గురించి ఆలోచించడం మాని.. పీఎంసీ సంక్షోభం నుంచి ప్రజలను ఎలా కాపాడటంపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు. తమ ప్రభుత్వంలో కుంభకోణాలే జరగలేదని చెప్తున్న మోడీ .. ఆర్టికల్ 370 గురించి ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వడం మానివేయాలని సూచించారు. పీఎంసీ స్కాం తర్వాత ఆర్బీఐ విధించిన ఆంక్షలతో పౌరులు ఇబ్బందికి గురవుతున్నారని పేర్కొన్నారు.
పీఎంసీ బ్యాంకులో రూ.4 వేల కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఖాతాదారుల విత్ డ్రాపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఆర్నెల్లకు రూ.40 వేలు విత్ డ్రా చేసుకోవాలని సూచించడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. అనారోగ్యంతో నలుగురు ఖాతాదారులు చనిపోయిన సంగతి కూడా తెలిసిందే.