అగ్రి బిల్లులపై రచ్చ.. బాలీవుడ్ థ్రిల్లర్ను తలపించిన రాజ్యసభ... కెమెరాలు ఆఫ్ చేశాక అసలేం జరిగింది..
లోక్సభలో సునాయాసంగా గట్టెక్కిన వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. విపక్ష సభ్యుల ఆందోళన,గందరగోళం నడుమనే బిల్లు సభా ఆమోదం పొందినట్లు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ ప్రకటించారు. ఒకరకంగా ఈ వ్యవహారమంతా బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ను తలపించిందనే చెప్పాలి. రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయాల కల్పన) బిల్లు-2020పై ఓటింగ్ పెట్టడంతో మొదలైన గందరగోళం... ఆ తర్వాత పీక్స్కి చేరింది.
Recommended Video
వ్యవసాయ బిల్లులకు లోక్సభ ఆమోదం - నిరసనగా 25న భారత్ బంద్కు రైతు సంఘాల పిలుపు
ఓటింగ్ సోమవారం నిర్వహించాలన్న విపక్షాలు...
అగ్రి బిల్లులపై వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ విపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన అనంతరం సభను వాయిదా వేసి సోమవారం(సెప్టెంబర్ 20) ఓటింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు పట్టుబట్టాయి. కానీ ప్రభుత్వం మాత్రం అందుకు ఒప్పుకోలేదు. తక్షణం బిల్లులను ఓటింగ్కి పెట్టడంతో విపక్ష సభ్యులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. మొదట తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అర్పితా ఘోష్,డోలా సేన్,కాంగ్రెస్ ఎంపీలు షెల్జా,జైరాం రమేష్,ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఛైర్మన్ వెల్లోకి చొచ్చుకెళ్లారు.
రూల్ బుక్ విసిరేసిందెవరు...
అనంతరం మరో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ కూడా వెల్ లోకి చొచ్చుకెళ్లారు. వెంట రూల్ బుక్ని తీసుకెళ్లిన ఆయన... డివిజన్ ఓటుకు లేదా బటన్ నొక్కడం ద్వారా ఓటుకు అనుమతించకపోవడం సభా నియామాలను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆయన రూల్ బుక్ని చించేసి డిప్యూటీ చైర్మన్ మీదకు విసిరేశారన్న విమర్శలు కూడా వినిపించాయి. అయితే రాజ్యసభ వీడియో ఫుటేజీని నిశితంగా గమనిస్తే... ఆ పని చేసింది డీఎంకె ఎంపీ తిరుచి శివ అని స్పష్టమవుతోంది. దీనిపై స్పందించిన ఒబ్రెయిన్... ఒకవేళ తాను రూల్ బుక్ని చించేసినట్లుగా నిరూపిస్తే రేప్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
రాజ్యసభ కెమెరాలు ఆఫ్...
ఇక్కడివరకూ రాజ్యసభలో ఏం జరిగిందో అంతా కెమెరాల్లో రికార్డవుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే సభ్యులు సభ నుంచి బయటకెళ్లేందుకు మొండికేసి పోడియం ముందు బైఠాయించారో సభలో కెమెరాలను ఆఫ్ చేశారు. దీంతో సభా ప్రొసీడింగ్స్ను టీఎంసీ సభ్యులు తమ సెల్ఫోన్లతో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. టీఎంసీ ఎంపీ, థియేటర్ ఆర్టిస్ట్ అయిన అర్పితా ఘోష్ సహచర ఎంపీ డోలా సేన్తో కలిసి సభలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలను వీడియో తీశారు.
రక్షణ వలయంగా మార్షల్స్
బిల్లును వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్.. సెక్రటరీ జనరల్ టేబుల్పై నిలుచుకోగా మార్షల్స్ ఆయన్ను బయటకు పంపించినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. పోడియంకు ఎదురుగా ఉన్న ఓ టేబుల్పై కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ సతవ్,రిపున్ బోరా కూర్చోగా... వారిని కూడా బయటకు పంపించేందుకు మార్షల్స్ ప్రయత్నించారు. అంతకుముందు,ఎంపీలంతా నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో డిప్యూటీ ఛైర్మన్ పోడియంకు అడ్డుగా మార్షల్స్ రక్షణ వలయంలా నిలుచున్నారు. ఇదంతా టీఎంసీ ఎంపీలు తీసిన వీడియోలో రికార్డయింది.
సమర్థించుకుంటున్న ఎంపీలు..
గతంలోనూ సభలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ... ఎంపీలు ఇలా సొంతంగా వీడియోలు తీయడం మాత్రం సభా నియామాలను ఉల్లంఘించడమేనన్న వాదన వినిపిస్తోంది. అయితే సదరు ఎంపీలు మాత్రం తమ చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యసభ కెమెరాలను ఆఫ్ చేయడంతో తమకు మరో ఆప్షన్ లేకుండా పోయిందని... అందుకే తమ సెల్ఫోన్లతో చిత్రీకరించాల్సి వచ్చిందని చెబుతున్నారు.