ఎప్పుడూ విమర్శలేనా..మీకు వేరే ధ్యాస లేదా? మీడియాపై ముఖ్యమంత్రి చిందులు!
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కోపం వచ్చింది. అలాంటిలాంటి కోపం కాదు.. హద్దులు దాటిన ఆగ్రహం. తీవ్ర అసహనానికి గురయ్యారాయన. మీడియా ప్రతినిధులు వేసే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక వారిపై ఎదురు దాడికి దిగారు. ఎదరు ప్రశ్నలు వేశారు. ప్రపంచంలో ఎక్కడా వరదలే రాలేదా?..ఇక్కడ మాత్రమే వచ్చాయా? అంటూ నిలదీశారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో మీడియా ప్రతినిధులు బిత్తరపోవాల్సి వచ్చింది. బిహార్ రాజధాని పాట్నాలో వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో నితీష్ కుమార్ పర్యటన సందర్భంగా ఈ చేదు అనుభవం వారికి ఎదురైంది.
సమాధానాలు కాదు.. పరిష్కారం కావాలి... పిల్లల మరణాలపై సీఎం నితీష్ కుమార్కు సుప్రిం అంక్షింతలు..
కొద్దిరోజులుగా ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు బిహార్ అల్లాడుతోన్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలోని పలు నదులు ఉప్పొంగి ప్రవహించడంతో తీర ప్రాంతాలు జలమయం అయ్యాయి. పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. రాజధాని పాట్నాలో పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. నాలుగైదు అడుగుల ఎత్తు మేర వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలు పాట్నాలో చాలా ఉన్నాయి. నడి వీధుల్లో తెప్పల ద్వారా వరద బాధితులను రక్షించాల్సి వచ్చింది. బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ నివాసం సైతం నీట మునిగింది. ఆయన కుటుంబాన్ని జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు కాపాడాయి.
పరిస్థితి అదుపు తప్పడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రంగంలోకి దిగారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన వెంట పలువురు మీడియా ప్రతినిధులు వెళ్లారు. ముఖ్యమంత్రి వద్ద పలువురు బాధితులు ఆయన ముందు తమ గోడును వెల్లబోసుకున్నారు. వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలను సందర్శించారు. పాట్నాలోని శ్రీ కృష్ణా స్మారక ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో ఆయన వరద బాధితుల నుంచి నిరసన ఎదురైంది. తమను ఎవరూ పట్టించుకోవట్లేదని, కనీస సౌకర్యాలు కూడా లేవని వాపోయారు. దీనిపై ఆయన స్థానిక అధికారులకు కొన్ని ఆదేశాలను జారీ చేశారు.
#WATCH Bihar Chief Minister Nitish Kumar after visiting flood-affected areas in Patna: I am asking in how many parts of the country & across the world, there have been floods? Is water in some parts of Patna the only problem we have? What happened in America? #BiharFloods pic.twitter.com/9XfNcuZr0H
— ANI (@ANI) October 1, 2019
అనంతరం విలేకరులతో మాట్టాడారు. వరద సహాయక చర్యలు, పునరావాస శిబిరాల్లో సౌకర్యాల గురించి కొందరు ప్రతినిధులు నితీష్ కుమార్ ను ప్రశ్నించారు. దీనితో ఆయన ఒకింత అసహనానికి గురయ్యారు. పదే పదే ప్రశ్నించడంతో ఇక ఆయన కోపం నషాళానికి అంటింది. విలేకరుల ప్రశ్నలకు అడ్డు పడుతూ.. ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బిహార్ లోనో లేక పాట్నాలో మాత్రమే వరదలు వచ్చాయా? ప్రపంచ వ్యాప్తంగా వరదలు వచ్చిన విషయం మీకు తెలియదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో ఏం జరుగుతోంది? అక్కడ వరదలు రాలేదా? అని ఎదురు ప్రశ్నలు వేశారు. పాట్నాలోని కొన్ని ప్రాంతాలు మాత్రమే వరద ప్రభావానికి గురైనంత మాత్రాన.. అంతా మునిగిపోయిందని చెప్పడం సరికాదని హితవు పలికారు. ఊహించని ఈ ఘటనలో మీడియా ప్రతినిధులు బిత్తరపోయారు.