ప్రశాంత్ కిషోర్ విషయంలో ఫోర్బ్స్ చెప్పిందే జరిగితే .. బీజేపీకి ఆ ఎన్నికల్లో కష్టమే!!
రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు ఉన్న పేరు ఎవరూ కాదనలేనిది. ఆయన రంగంలోకి దిగారంటే ఆ పార్టీ గెలుపు ఖాయం అనే భావన రాజకీయ వర్గాల్లో తప్పక ఉంటుంది. ఇక ప్రత్యర్థి పార్టీకి పీకే వ్యూహాలు తట్టుకుని నిలబడటం చాలా కష్టం అవుతుంది. వైయస్ జగన్ కు గత ఎన్నికల సమయంలో రాజకీయ వ్యూహ కర్త గా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో విజయం సాధించి వైసీపీ పాలనా పగ్గాలు చేపట్టటానికి తెర వెనుక చేసిన కృషి గణనీయమైనది. అలాంటి ప్రశాంత్ కిషోర్ కు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. చాలా ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ జాబితాలో ఆయనకు స్థానం దక్కింది. ఇప్పుడు ఇది పీకే ని ప్రధానంగా టార్గెట్ చేసుకుంటున్న బీజేపీకి అసలు రుచించని అంశంగా మారింది.
ప్రశాంత్ కిషోర్కు చెక్.. జేడీయూకు జోడు పదవులు.. బీహార్లో బీజేపీ వ్యూహం ఇదేనా?
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా పీకే
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ విజయానికి మూల కారకుల్లో ఒకరైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకుని అనూహ్య గౌరవాన్ని పొందారు . ప్రస్తుతం బీహార్లో జేడీయూ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన ఈ అరుదైన గౌరవం సంపాదించుకున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రస్తుతం పీకే పని చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల సమరానికి సన్నద్ధం అవుతున్న వేళ ఫోర్బ్స్ టాప్ 20 జాబితాలో పీకే పేరు ఉండటం బీజేపీకి ఒక షాక్ అనే చెప్పాలి.
ఈ దశాబ్దపు రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ప్రభావవంతమైన వ్యక్తి అన్న ఫోర్బ్స్
ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో ప్రశాంత్ కిశోర్ గురించి ప్రస్తావిస్తూ ఈ దశాబ్దపు రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ చాలా కీలక వ్యక్తి కానున్నారని పేర్కొన్నారు. ఫోర్బ్స్ చెప్పినట్లే ప్రశాంత్ గత దశాబ్ద కాలంలో రాజకీయాల్లో తెర వెనుక వ్యూహాలతో అత్యంత కీలక వ్యక్తిగా ఎదిగారు. ఇక పీకే ప్రస్థానాన్ని చూస్తే 2009లో అప్పటి గుజరాత్ సీఎం, ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ 2014 సార్వత్రిక ఎన్నికల వ్యూహరచన కోసం ఆయనతో పొత్తు పెట్టుకున్నారు. ఇండియాలో సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని ప్రారంభించి టెక్నాలజీని వాడుకోవటం మొదలుపెట్టింది కూడా ప్రశాంత్ కిషోరే.
వరుస ఎన్నికల్లో బీజేపీ ప్రత్యర్ధుల కోసం పీకే వ్యూహాలు
ఇక ఆ తర్వాత అయన పంజాబ్ కాంగ్రెస్ లీడర్ అమరేందర్ సింగ్, ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కోసం కూడా పనిచేశారు. ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ ఢిల్లీ ఎన్నికలలో కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ కోసం పని చేస్తూ బీజేపీకి చెమటలు పట్టిస్తున్నారు. అనంతరం జరగబోయే బెంగాల్ ఎన్నికల్లో మమత బెనర్జీ కోసం కూడా ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు. ఇదే బీజేపీకి తలనొప్పిగా మారనుంది. ఈ సమయంలో పీకే కు అత్యంత ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కటం కూడా ఆయనకు ప్లస్ అవుతుందనే చెప్పాలి.
బీజేపీకి అనేక విషయాల్లో తలనొప్పిగా మారిన పీకే
ఇప్పటికే బీజేపీకి షాక్ ఇచ్చేలా కేజ్రీవాల్ కోసం పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. బీహార్ విషయంలో కూడా 50: 50 సీట్ల ఫార్ములా ఈసారి నడవదని ప్రకటించారు. ఎన్నార్సీని, సీఏఏ ని వ్యతిరేకిస్తూ బీజేపీపై మాటల దాడి చేస్తున్న పీకే కి ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కటం , రాజకీయాల్లో అత్యంత ప్రభావం చూపించగల వ్యక్తిగా ఇంత గౌరవం దక్కడం మోదీ అండ్ టీమ్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనే చెప్పాలి . మొత్తానికి ఫోర్బ్స్ చెప్పిన లెక్క ప్రకారం ఈ దశాబ్దం కూడా ప్రశాంత్ కిశోర్ హవా కొనసాగనుంది. అదే జరిగితే బీజేపీకి భవిష్యత్ ఎన్నికల్లో ఎదురుగాలే అని చెప్పొచ్చు.