మా ముందు ఎయిరిండియా చీఫ్ ఎంత? పరిధిలో ఉంటే మంచిది : శివసేన దూకుడు
తప్పు చేసిన తమ ఎంపీని వెనకేసుకు రావడమే కాకుండా ‘‘మా ముందు ఆ ఎయిరిండియా చీఫ్ ఎంత?’’ అంటూ హద్దు మీరి మాట్లాడారు శివసేన ఎంపీ సంజయ్ రావత్.
న్యూఢిల్లీ: తప్పు చేసిన తమ ఎంపీని వెనకేసుకు రావడమే కాకుండా హద్దు మీరి మాట్లాడారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. ''మా ముందు ఆ ఎయిరిండియా చీఫ్ ఎంత?'' అని ఆయన ప్రశ్నించడమే కాదు, ''అతను కేవలం ప్రభుత్వ సేవకుడు. అతను తన పరిధిలో ఉంటే మంచిది..'' అంటూ రౌత్ హెచ్చరిక చేశారు.
అంతేకాదు, ఈ నెల 10లోగా సమస్యను పరిష్కరించకపోతే తాము ఎన్డీఏ సమావేశాలకు హాజరు కాబోమని కూడా సంజయ్ రౌత్ స్పష్టంచేశారు. లోక్సభలో మంత్రి అశోక గజపతి రాజు సమాధానం సంతృప్తికరంగా లేదని అన్నారు. ఓ వ్యక్తిని చెప్పుతో కొడితే హత్యాయత్నం కేసు ఎలా పెడతారు? అంటూ ప్రశ్నించారు.
అనంత్ కుమార్ గీతే రుబాబు...
అంతకుముందు ఉదయం లోక్సభలో ఇదే అంశంపై శివసేన ఎంపీ, మంత్రి అనంత్కుమార్ గీతే కూడా హద్దు మీరి వ్యవహరించిన విషయం తెలిసిందే. మంత్రి అశోక గజపతి రాజు సమాధానంతో సంతృప్తి చెందని గీతే.. ఆయనపైకి దూసుకెళ్లాగా.. ఇది గమనించిన మరో మంత్రి స్మృతి ఇరానీ, ఎంపీ అహ్లూవాలియా.. అక్కడికి చేరుకుని ఆయనను బయటకు తీసుకెళ్లారు.
చట్టం ముందు అందరూ సమానమే...
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్, ఎయిర్ లైన్స్ వివాదం నేపథ్యంలో ఇవాళ లోక్సభలో రగడ జరిగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ.. సభలో గైక్వాడ్ తన తప్పేమీ లేదని వివరణ ఇచ్చినా గైక్వాడ్పై నిషేధం విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నట్లు వివరించారు. చట్టం ముందు అందరూ సమానులే అని పేర్కొన్నట్టు వెల్లడించారు. చట్ట ప్రకారం నిషేధం ఉంటుందని తెలిపారన్నారు.
క్షమాపణ చెప్పి... విమానం ఎక్కేద్దామనే?
ఎయిరిండియా ఉద్యోగిపై చేయి చేసుకుని విమాన ప్రయాణాల విషయంలో నిషేధం ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఈ రోజు లోక్ సభలో మాట్లాడుతూ కావాలంటే తాను పార్లమెంటుకు క్షమాపణ చెబుతానుగానీ ఎయిరిండియాకు మాత్రం చెప్బబోనన్నారు. దీనిపై ఎయిరిండియా సిబ్బంది స్పందిస్తూ.. అసలు ఆయన్ని క్షమాపణ ఎవరడిగారంటూ ఎదురు ప్రశ్నించారు. రవీంద్ర గైక్వాడ్ క్షమాపణ చెప్పనక్కర్లేదని, సారీ చెప్పేసి విమానం ఎక్కాలనుకుంటున్నారమో.. అది మాత్రం తాము జరగనివ్వమని ఎయిర్ లైన్స్ సిబ్బంది వ్యాఖ్యనించారు.
విమానాశ్రయాల్లో భద్రత పెంపు...
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్-ఎయిరిండియా వివాదం నేపథ్యంలో.. పార్లమెంటులో ఈ రోజు శివసేన ఎంపీలు గందరగోళం సృష్టించడం, ముంబై నుంచి ఎయిరిండియా విమానాలు ఎలా ఎగురుతాయో తామూ చూస్తామంటూ హెచ్చరించడంతో ఎయిరిండియా అలర్ట్ అయింది. మహారాష్ట్రలోని విమానాశ్రయాల వద్ద భద్రతను పెంచాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో, విమానాశ్రయాల వద్ద భద్రతను పెంచారు.