మిషన్ శక్తి.. ఇదో శాటిలైట్ కిల్లర్
ఢిల్లీ : శత్రువుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలంటే బలమైన సైనిక బలగం కావాలి. అత్యాధునిక ఆయుధాలు అందుబాటులో ఉండాలి. అన్నింటినీ మించి సరైన దిశానిర్దేశం చేసే నాయకత్వం కావాలి. అయితే ఇది ఒకప్పటి మాట. టెక్నాలజీ పుణ్యమాని ఎప్పుడు ఏ రూపంలో దాడి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. నింగి, నేల, నీటి నుంచి దూసుకొచ్చే ముప్పు మాత్రమే కాదు.. అంతరిక్షం నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సత్తా ఉండాలి. ఈ విషయాన్ని గ్రహించి భారత్ ఆ దిశగా అడుగులు వేసింది. శత్రుదేశాల శాటిలైట్ల ఆటకట్టించే అత్యాధునిక టెక్నాలజీని అభివృద్ధి చేసింది.
భూ ఉపరితలానికి 300 కి.మీ ఎత్తు: స్పేస్ జామ్ ను క్లియర్ చేసే ఆయుధం!
అంతరిక్షంలో పెరుగుతున్న సవాళ్లు
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అంతరిక్షంపై పట్టు కోసం పోటీ పెరిగిపోతోంది. ఇందుకోసం ప్రపంచదేశాలు సరికొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నాయి. ఫలితంగా అంతరిక్షంలో శత్రుదేశాల నుంచి ఎదురయ్యే సవాళ్లు పెరిగిపోతున్నాయి. వాటిని సమర్థంగా ఎదుర్కోవడంతో పాటు మన శాటిలైట్లను కాపాడుకునేందుకు తగిన రక్షణ వ్యవస్థ కావాలి. అప్పుడే దేశ రక్షణ, అంతరిక్ష పరిశోధనలు సజావుగా సాగుతాయి. భారత రహస్యాల కోసం శత్రుదేశాలు నిఘా శాటిలైట్లను పంపడం తగ్గుతాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం భూమికి సమీపంలోని శాటిలైట్లు టార్గెట్గా కొత్త వెపన్ సిద్ధం చేసింది.
యాంటీ శాటిలైట్ వెపన్స్ అంటే ఏమిటి?
యాంటీ శాటిలైట్ వెపన్.. దీన్నే కైనటిక్ స్టిల్ వెపన్ అంటారు. ప్రత్యేకంగా వార్హెడ్లు ఉపయోగించకుండ శత్రు శాటిలైట్లను పేల్చేసే వ్యవస్థ ఇది. శత్రుదేశాల కారణంగా అంతరిక్షంలో భద్రతాపరమైన సమస్యలు ఏర్పడినప్పుడు వీటిని ఉపయోగిస్తారు. అంతరిక్షంలో నిరుపయోగంగా ఉన్న శాటిలైట్లను పేల్చివేసేందుకు కూడా యాంటీ శాటిలైట్ వెపన్స్ పనికొస్తాయి.
యూఎస్, రష్యా, చైనా సరసన భారత్
యాంటీ శాటిలైట్ల వెపన్స్ను తయారుచేయడంలో అగ్రరాజ్యాలు ఎంతో ముందున్నాయి. అమెరికా, చైనా, రష్యాలు ఈ శాటిలైట్ కిల్లర్స్ను ఎప్పుడో తమ అమ్ములపొదిలో చేర్చుకున్నాయి. అంతరిక్ష పరిశోధనలకు ఆద్యులైన అమెరికా, సోవియట్ యూనియన్ లు ఈ విధ్వంసకర ఆయుధాల తయారీకి శ్రీకారం చుట్టాయి. కోల్డ్వార్ సమయంలోనే ఈ రెండు దేశాలు దాదాపు 54సార్లు ఈ యాంటి శాటిలైట్ వెపన్స్ పరీక్షించాయి. 1985లో తన వెదర్ శాటిలైట్ స్లోవిండ్ను అమెరికా ఇదే పద్దతిలో కూల్చేసింది. 1985 సెప్టెంబర్లో భూమికి 555కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపగ్రహాన్ని తునాతునకలు చేసింది. 1964లో అప్పటి సోవియట్ రష్యా ఈ ప్రయోగం నిర్వహించింది.
2007లో చైనా ప్రయోగం
భారత్కు పక్కలో బల్లెంలాంటి పొరుగుదేశం చైనా కూడా 2007లోనే యాంటి శాటిలైట్ టెస్ట్ చేసింది. తన వెదర్ శాటిలైట్ చెడిపోయిందన్న నెపంతో దాన్ని పేల్చేసింది. దాదాపు 40వేల ముక్కలైన ఆ ఉపగ్రహ శకలాలు నేటికీ భూమిచుట్టూ తిరుగుతున్నాయి. చెడిపోయిన ఉపగ్రహాన్ని నాశనం చేసేందుకు పేల్చేశామని చైనా సుద్దులు చెప్పినా..తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలపడమే దాని ఉద్దేశమన్నది బహిరంగ రహస్యం.
శాటిలైట్ల రక్షణ కోసం ఇస్రో ప్రయోగాలు
వాస్తవానికి అంతరిక్షంలో భారత శాటిలైట్ల రక్షణ కోసం ఇస్రో చాలా కాలంగా ప్రయోగాలు చేస్తోంది. రక్షణ రహస్యాలు శత్రుదేశాలకు చిక్కకుండాపటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటుకు ప్రయ్నిస్తోంది. ఈ వ్యవస్థను త్రివిధ దళాలకు అనుసంధానం చేస్తే శాటిలైట్ చిత్రాలు, రాడార్స్ పంపే సిగ్నల్స్ ఆధారంగా శత్రుదేశాల కదలికలను ముందుగానే గుర్తించి దాడి చేసే అవకాశం ఉంటుంది. ఈ తరహా టెక్నాలజీని అమెరికా, రష్యా చైనాలు ఇప్పటికే సమకూర్చుకోగా.. భారత్ కూడా త్వరలోనే ఈ కల నిజం చేసుకోనుంది.