ఆర్టికల్ 35A ఎందుకింత వివాదమవుతోంది... అందులో ఏముంది..?
Recommended Video
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 35A చెల్లుబాటుపై వాదనలను సుప్రీంకోర్టు ఆగష్టు 27కు వాయిదా వేసింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఈ చట్టాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేయడం జరిగింది. అయితే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో వస్తున్నందున విచారణను వాయిదా వేయాల్సిందిగా ప్రభుత్వం కోరింది. అంతేకాదు ఒకవేళ తీర్పు ప్రతికూలంగా ఉంటే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని కేంద్రం కోర్టుకు తెలిపింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారణ చేస్తోంది. ముందుగా ఆర్టికల్ 35Aలోని అంశాలు రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తాయా లేదా అనే దానిపై చూడాలని జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. ఆ తర్వాతే కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలా లేదా అన్నది చెబుతుందని చెప్పారు.
ఆర్టికల్ 35Aకు చట్టబద్దత లేదు
కోర్టు నిర్ణయంపై పిటిషనర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. కశ్మీర్ పాలనాధికారులు మాత్రం మరో వాయిదా పడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆర్టికల్ 35Aను విచారణ చేయాల్సిందిగా మొత్తం నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. 'వి ది సిటిజెన్స్' అనే ఎన్జీఓ సంస్థ ముందుగా పిటిషన్ వేసింది. ఆర్టికల్ 35A అనేది నేరుగా రాష్ట్రపతి ఆదేశాలతో 1954లో రాజ్యాంగంలో చేర్చబడిందని... ఆ చట్టం పార్లమెంటు ముందుకు రాలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఆర్టికల్ 35A ఒక ఒప్పందంలానే ఉందని రాజ్యాంగ సవరణలా లేదని పిటిషనర్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆర్టికల్ 35Aను నీరుగార్చాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అక్కడి వేర్పాటు వాదులు హెచ్చరించారు.
ఆర్టికల్ 35A అంటే ఏమిటి..?
జమ్ముకశ్మీర్లో నివాసముంటున్న శాశ్వత పౌరులకు ప్రత్యేక హక్కులు కల్పిస్తుంది. బయటి రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు జమ్ము కశ్మీర్లో ఎలాంటి భూమి కొనుగోలు కానీ, ఆస్తులు కానీ, అక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం కానీ, లేదా ఆ రాష్ట్రం ఇచ్చే స్కాలర్ షిప్లు వినియోగించడానికి అనర్హులు అవుతారని ఆర్టికల్ 35A స్పష్టం చేస్తోంది. ఆర్టికల్ 35Aను 1954లో రాష్ట్రపతి ఉత్తర్వులు ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. మరోవైపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 జమ్ముకశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పిస్తుండగా...ఆర్టికల్ 35A మాత్రం శాశ్వత పౌరులకు ప్రత్యేక హక్కులు , ఫలాలు అందేలా నిర్వచన చెబుతోంది.
ఆర్టికల్ 35A ఎలా వచ్చింది..?
నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కేబినెట్ సలహాద్వారా అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ఆర్టికల్ 35Aకు ఆమోదం తెలపడంతో రాజ్యాంగంలో చేర్చడం జరిగింది.1952లో నాడు జమ్ముకశ్మీర్ ప్రధానిగా ఉన్న షేక్ అబ్దుల్లాతో భారత ప్రధాని నెహ్రూ ఒక ఒప్పందానికి రావడం జరిగింది. ఇందులో భాగంగా జమ్ము కశ్మీర్కు కొన్నిప్రత్యేక హక్కులు కట్టబెట్టారు. భారత పౌరసత్వం వేరు జమ్ముకశ్మీర్ పౌరసత్వం వేరు అనేది ఇందులో గమనించాల్సిన విషయం. దీనికి కొనసాగింపుగానే 1954లో రాష్ట్రపతి ఆర్టికల్ 35Aకు ఓకే చెప్పారు. ఇలా ఆర్టికల్ 35A రాజ్యాంగంలో ఒక ప్రత్యేక అధికరణగా చేర్చబడింది.
ఆర్టికల్ 35Aపై వివాదమేంటి..?
భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 35A ఏదైతే జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని శాశ్వత పౌరులకు ప్రత్యేక హక్కులు, ఫలాలు కల్పిస్తోందో అది కేవలం ఒప్పందంలాగే ఉందని రాజ్యాంగ సవరణలా లేదని చెప్పడంతో వివాదం రాజుకుంది. ఇదే విషయాన్ని ఎన్జీఓ సంస్థ ప్రస్తావిస్తూ ఇది రాజ్యాంగ బద్దం కాదని పిటిషన్లో పేర్కొంది. ఎందుకంటే 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానే రాజ్యాంగంలో చేర్చారని... దానికి చట్టబద్ధత కల్పించలేదని ఎన్జీఓ సంస్థ తన వాదనలు వినిపిస్తోంది. అదికూడా తాత్కాలిక ఒప్పందం మాత్రమే అని చెబుతోంది. చట్టబద్దత కల్పించాల్సిందిగా ఇప్పటి వరకు ఎప్పుడూ పార్లమెంటు ముందుకు రాలేదని వారు చెబుతున్నారు. ఎన్జీఓ సంస్థ వాదన ఇలా ఉంటే... జమ్ము కశ్మీర్ ప్రభుత్వం మాత్రం మరో పిటిషన్ దాఖలు చేసింది. కొత్త ప్రొవిజన్ రాజ్యాంగంలో పొందుపరిచే నిర్ణయాధికారం, ఆదేశాలు ఇవ్వగలిగే అధికారం రాష్ట్రపతికి ఉంటాయని కౌంటర్ దాఖలు చేసింది.