బీహార్ ఎన్నికల్లో 'భురాబల్'పై హాట్ చర్చ... తేజస్విపై ఎక్కుపెట్టిన బీజేపీ... అసలేంటీ వ్యవహారం...
ఇటీవలి ఎన్నికల ప్రచార ర్యాలీలో మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ చేసిన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అగ్ర కులాలను కించపరిచేందుకే తేజస్వి ఆ వ్యాఖ్యలు చేశాడని బీజేపీ ఆరోపిస్తోంది. తేజస్విని టార్గెట్ చేసేందుకు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న బీజేపీకి ఇదో అస్త్రంలా మారిందన్న వాదన వినిపిస్తోంది. ఇంతకీ తేజస్వి ఏం వ్యాఖ్యలు చేశారు... బీజేపీ అగ్ర కులాల అంశాన్ని ఎందుకు తెర పైకి తెచ్చింది...
ఉల్లిగడ్డలతో దండ: ధరల పెంపుపై తేజస్వీ యాదవ్ నిరసన, కేంద్రంపై ఫైర్..
ఇంతకీ తేజస్వి ఏమన్నారు...
అక్టోబర్ 26న,మహాకూటమి తరుపున బీహార్లోని రోహ్తస్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార ర్యాలీలో తేజస్వి యాదవ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో పేద ప్రజలు బాబు సాహెబ్ల(అగ్ర కులాల) ముందు ఆత్మవిశ్వాసంతో నడిచేవారు.' అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో... తాను అగ్ర కులాలను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని తేజస్వి వివరణ ఇచ్చుకున్నారు.
అసలేంటీ భురాబల్...
తేజస్వి చేసిన ఆ వ్యాఖ్యలను బీజేపీ ఎన్నికల అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. డిప్యూటీ సీఎం,ఆ పార్టీ నేత సుశీల్ కుమార్ మోదీ తేజస్వి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. బీహార్లో 'భూ-రా-బా-లా'ను లేకుండా చేయాలనుకుంటున్న ఆర్జేడీ రాజకీయాలను అగ్ర కులాలు గమనించాలన్నారు. భు-రా-బా-లా(BHU-RA-BA-L) అంటే... బీహార్కు చెందిన అగ్ర కులాలైన భూమిహార్-రాజ్పుత్-బ్రాహ్మణ్-లాలా(క్షత్రియ). ఈ నాలుగు కులాలను ఉద్దేశించి తేజస్వి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని సుశీల్ కుమార్ మోదీ అన్నారు. ఆర్జేడీ అగ్ర కులాలకు వ్యతిరేకమని... అందుకే గతంలో వారికి 10శాతం రిజర్వేషన్ను వ్యతిరేకించిందని అన్నారు. మరోసారి బీహార్ను ఆర్జేడీ కులాల ప్రాతిపదికన విడగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
అప్పట్లో లాలూ నినాదం....
బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ తొలిసారి ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు 'భురాబల్' నినాదాన్నే ఎత్తుకున్నారు. అప్పుడు మండల్ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ బీసీలను ఏకం చేసేందుకు భురాబల్ సాఫ్ కరో(అగ్ర కులాలను ఊడ్చిపారేయండి) నినాదంతో ఎన్నికల్లో దిగారు. అప్పటి నుంచి బీసీల్లో ఆర్జేడీకి బలమైన ఓటు బ్యాంకు ఏర్పడింది. వరుసగా మూడు పర్యాయాలు ఆర్జేడీ బీహార్లో అధికారం చేపట్టింది. కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది. 90ల తర్వాత ఆ నినాదాన్ని పక్కనపెట్టి... అగ్ర కులాల అభ్యర్థులకు కూడా ఆర్జేడీ టికెట్లు ఇచ్చారు. 2009లో ఆర్జేడీ బీసీ మంత్ర నుంచి పూర్తిగా పక్కకు వచ్చింది. అప్పటి ఎన్నికల్లో ఆర్జేడీ తరుపున గెలిచిన నలుగురు ఎంపీల్లో ముగ్గురు అగ్ర కులాలు(రాజ్పుత్)లకు చెందినవారే కావడం గమనార్హం.
Recommended Video
మారిన ఆర్జేడీ స్ట్రాటజీ...
తేజస్వి చేసిన వ్యాఖ్యలతో మహాకూటమికి అగ్ర కులాల ఓట్లను దూరం చేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది ఇప్పుడే అంచనా వేయడం కష్టం. ఇప్పటికే తొలి విడత పోలింగ్ ముగియగా... మొత్తం మూడు విడతల్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు వెలువడనున్నాయి. అటు ఎన్డీయే,ఇటు మహాకూటమి ఇరువురు గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఇందులో ఎవరి ధీమా నిజమవుతుందో తెలియాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే.